Jayasudha Shocking Comments: తెలుగు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఎంతోమంది ఉన్నా.. సహజ నటి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘జయసుధ’దే. సహజమైన నటనకు జయసుధ బ్రాండ్ అంబాసిడర్. పైగా మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటి ఆమె. ఈ ఏడాదితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జయసుధ ప్రస్థానం మొదలై యాభై సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో వివక్ష విపరీతంగా పెరిగిపోయింది అని జయసుధ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

‘సినిమాల్లో ఎవరైనా హీరో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే అది గొప్ప రికార్డు అని వేడుకలు చేస్తారు. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హడావుడి చేస్తారు. కానీ, అదే ఒక నటికి అయితే, కనీసం ఒక ఫ్లవర్ బొకే కూడా పంపరు. ఇండస్ట్రీలో ఈ పరిస్థితి గురించి చెబుతూ ‘నాకు ఫ్లవర్ బొకే కూడా పంపించిన వాళ్ళు లేరు’ అని జయసుధ కామెంట్స్ చేసింది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న వివక్ష గురించి కూడా జయసుధ షాకింగ్ కామెంట్స్ చేసింది. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లను ఒకలా ట్రీట్ చేస్తున్నారు. మీకు తెలియదు, వారి కుక్కపిల్లకు కూడా స్టార్ హోటల్ లో రూమ్ ఇస్తున్నారు. కానీ.. ఇక్కడ నటీమణులకు మాత్రం ఆ కుక్కకి ఇచ్చిన రూమ్ కూడా ఇవ్వరు. అలాగే, బాగా సక్సెస్ అయిన పెద్ద హీరోలను ఒకలా ట్రీట్ చేస్తారు. ఇక హీరో కంటే హీరోయిన్లను చాలా తక్కువగా ట్రీట్ చేస్తారు’ అని జయసుధ ఘాటుగా వ్యాఖ్యానించారు.
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) బిల్డింగ్ పై కూడా జయసుధ మాట్లాడారు. మురళీమోహన్ గారు అధ్యక్షులుగా పని చేసినప్పటి నుంచి ‘మా’ కి బిల్డింగ్ కడతామని చెబుతూ వస్తున్నారు. నాకు తెలిసి మరో 25 ఏళ్ళ తర్వాత అయినా ఆ బిల్డింగ్ కడతారా ? అంటూ జయసుధ ఇన్ డైరెక్ట్ గా మంచు విష్ణుని ఉద్దేశించి విమర్శించారు. ‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల గురించి, అలాగే మంచు మోహన్ బాబు గురించి చెప్పాలంటే… తన 50 ఏళ్ళ కెరీర్ అంత ఉంటుందని జయసుధ పరోక్షంగా మంచు ఫ్యామిలీకి చురకలు అంటించారు.

జయసుధ పద్మశ్రీ పురస్కారం పై కూడా తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. పద్మశ్రీకి కేవలం బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే అర్హులా.. ?, తెలుగు హీరోయిన్లకు ఆ అర్హత ఉండదా? అని జయసుధ లేవనెత్తిన టాపిక్ నిజంగా ఆలోచించదగ్గ అంశమే. జయసుధ కంటే విద్యాబాలన్, కంగనా ఏమి గొప్ప నటీమణులు కాదు కదా. తెలుగు వారి పై, అలాగే సౌత్ నటీమణుల పై ఎప్పటి నుంచో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే తెలుగు నటీనటులను తెలుగు రాజకీయ ప్రముఖులే ఒక్కటై సపోర్ట్ చేయాలి.


