నటన మీద ఉన్న ఆసక్తితో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నవీన్ కు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సినిమాలో అవకాశం కల్పించారు. దీంతో నవీన్ పోలిశెట్టి అందులో కనిపించిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత డీ ఫర్ దోపిడీ, 1 నేనొక్కడినే వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి చిత్రంతోనే భారీ హిట్ సాధించిన నవీన్ వెంటనే బాలీవుడ్ లో చిచ్చోరే అనే సినిమాలో నటించాడు. అక్కడ కూడా గుర్తింపు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జాతిరత్నాలు అనే సినిమాలో నటించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. వరుసగా హిట్లు తన ఖాతాలో వేసుకున్న నవీన్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
కేవీ అనుదీప్ దర్శకత్వంలో జాతిరత్నాలు మూవీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో సినిమాను ఒప్పుకున్నాడు. వీటితోపాటు యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులు చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. కానీ నెటిజన్లు మాత్రం నవీన్ పై ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు బర్త్ డే విషెస్ చెప్పడంలో ఆయనకున్న అవసరమేంటని ప్రశ్ణిస్తున్నారు.