Krishnam Raju Daughters: నటుడు కృష్ణంరాజు మరణం పరిశ్రమను విషాదంలో నింపింది. ఆయన మరణాన్ని తీర్చలేని లోతుగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. రెండవ తరం సూపర్ స్టార్ అయిన కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు కాగా వారు పుట్టక ముందే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కృష్ణంరాజు మొదట వరసకు మరదలైన సీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
సీత మరణం కృష్ణంరాజును తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. కొన్నాళ్ళు ఆయన డిప్రెషన్ అనుభవించారు. ఇకపై జీవితంలో వివాహం చేసుకోకూడదు అనుకున్నాడు. ఆ కారణంతోనే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి. అయితే కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తప్పక 1996లో శ్యామలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అనే ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. దత్త పుత్రిక అయినా… ప్రశాంతి అంటే కృష్ణంరాజుకు ప్రాణం.
మంచి సంబంధం చూసి ప్రశాంతి వివాహం ఘనంగా చేశాడు.ప్రస్తుతం ఆమె హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. మొదటి భార్య చనిపోయిన బాధలో ప్రశాంతిని ఆయన దత్త తీసుకోవడం జరిగింది. అయితే కడుపున పుట్టిన కూతుళ్ళకు మాత్రం ఆయన వివాహం చేయలేదు. ఇప్పుడు వారి బాధ్యత ప్రభాస్ పై పడింది. పెదనాన్న పిల్లల ఆలనా పాలనా ప్రభాస్ చూసుకోవాలి. కృష్ణంరాజు దత్తత తీసుకున్న ప్రశాంతి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు మాత్రమే అనుకుంటారు.
నటుడిగా, మాజీ మంత్రిగా దశాబ్దాల పాటు కృష్ణంరాజు సేవలు అందించారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆరోగ్యం విషమించడంతో సెప్టెంబర్ 10 రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అంతర్గత అవయవాలు పని చేయకపోవడంతో ఆయన సెప్టెంబర్ 11 తెల్లవారుజామున కన్నుమూశారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైస్ జగన్ ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.