Railway Ticket Sprocket Holes: మన భారతదేశంలో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి పూర్వ కాలం నుంచే అన్ని రకాలా సౌకర్యాలను అందించేవారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ వద్ద ఇచ్చే కాగితపు టిక్కెట్లను గమనిస్తే.. వాటి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు కనిపించేవి. చాలామంది వాటిని కేవలం డిజైన్లో భాగమని భావించేవారు. కానీ వాస్తవానికి ఆ రంధ్రాలు ఉండడానికి వేరే కారణాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అవి కనిపించడం లేదు. ఒకప్పుడు ఆ రంధ్రాలను ఎందుకు ఉంచారు? ఇప్పుడు వాటిని ఎందుకు తొలగించారు?
భారతీయ రైల్వే టిక్కెట్ కాగితాల ఇరువైపులా వరుసగా ఉండే ఈ చిన్న రంధ్రాలను సాంకేతిక పరిభాషలో ‘స్ప్రోకెట్ హోల్స్’ అని పిలుస్తారు. ఇవి కాగితాన్ని ప్రింటర్లో సరిగ్గా ముందుకు నడిపించేందుకు ఉపయోగపడేవి. కాగితం పక్కల ఉన్న ఈ రంధ్రాల్లో ప్రింటర్లోని ప్రత్యేక దంతాలు ఇమిడిపోయి కాగితాన్ని సమాన వేగంతో లాగేవి. గతంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో ప్రధానంగా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు ఉపయోగించేవారు. ఈ ప్రింటర్లు నిరంతరంగా ఉండే పొడవైన కాగితాలపై ముద్రణ చేసేవి. కాగితం వంకరగా పోకుండా, ఇరుక్కుపోకుండా, అక్షరాలు సరిగ్గా ముద్రించబడేలా స్ప్రోకెట్ హోల్స్ సహాయపడేవి. దీంతో వేగవంతమైన, ఖచ్చితమైన ప్రింటింగ్ సాధ్యమయ్యేది.రైల్వే టిక్కెట్లను భారీ సంఖ్యలో ముద్రించాల్సి ఉండేది. రోజుకు వేలాది టిక్కెట్లు జారీ చేసే సమయంలో ప్రింటింగ్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు స్ప్రోకెట్ హోల్స్ ఉన్న ప్రత్యేక టిక్కెట్ రోల్స్ను ఉపయోగించేవారు. దీంతో టిక్కెట్లు సరిగ్గా వరుసగా ముద్రించబడటంతో పాటు ప్రింటర్లో కాగితం చిక్కుకుపోయే సమస్యలు కూడా తగ్గేవి.
కాలక్రమేణా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ల స్థానంలో అధునాతన థర్మల్ ప్రింటర్లు, లేజర్ ఆధారిత ప్రింటింగ్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రింటర్లలో కాగితాన్ని లాగేందుకు స్ప్రోకెట్ వ్యవస్థ అవసరం ఉండదు. ప్రత్యేక రోలర్ల సాయంతో కాగితం స్వయంచాలకంగా ముందుకు కదులుతుంది. అందువల్ల కాగితాలపై రంధ్రాలు ఉండాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోయింది. స్ప్రోకెట్ హోల్స్ ఉన్న కాగితాల తయారీకి అదనపు ప్రక్రియ అవసరమవుతుంది. కొత్త తరహా థర్మల్ టిక్కెట్లలో ఈ అవసరం లేకపోవడంతో కాగితం తయారీ వ్యయం తగ్గింది. అలాగే కాగిత వినియోగం కూడా మరింత సమర్థవంతంగా మారింది. రైల్వే శాఖకు దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గాయి.
ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్, మొబైల్ టిక్కెట్లు, SMS టిక్కెట్లు, QR కోడ్ ఆధారిత ఈ-టిక్కెట్లను ఉపయోగిస్తున్నారు. దీంతో సంప్రదాయ కాగితపు టిక్కెట్ల వినియోగం కూడా గణనీయంగా తగ్గింది. రైల్వే స్టేషన్లలో జారీ చేసే టిక్కెట్లు సైతం ఆధునిక థర్మల్ ప్రింటర్ల ద్వారా ముద్రించబడుతున్నాయి. అప్పటి ప్రింటింగ్ సాంకేతికతకు అవి వెన్నెముకలాంటివి. అయితే సాంకేతిక పరిణామంతో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు చరిత్రలో కలిసిపోవడంతో స్ప్రోకెట్ హోల్స్ కూడా క్రమంగా కనుమరుగయ్యాయి. నేటి యువతకు అవి కనిపించకపోయినా, భారతీయ రైల్వే టిక్కెట్ల పరిణామక్రమంలో అవి ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయాయి.
