Tiger: పెద్ద గండం గడిచింది. గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి( East Godavari ) జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి చిక్కింది. గత ఐదు రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు పశువుల శాలలో ఉండగా చిక్కింది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది పెద్దపులి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరించింది. రాజానగరం, రాయవరం మండలాల్లో మూగజీవాలను బలితీసుకుంది. చివరకు రాయవరం మండలం కూర్మాపురంలో పాడుబడ్డ ఇంట్లో చొరబడ్డ పెద్దపులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు అధికారులు.
* కంటిమీద కునుకు లేకుండా..
ఐదు రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పులి స్థానికులకు కనిపించింది. దీంతో అటవీ శాఖ( Forest Department) అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. ముందస్తు అప్రమత్తం చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చే గన్ లను సైతం సిద్ధం చేశారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా పూనే నుంచి రెస్క్యూ టీం ను రప్పించారు. వారి ఆపరేషన్ సక్సెస్ కావడంతో పులి పట్టుబడింది. పాడుబడ్డ ఇంటి బయట గన్స్, బోనులతో పహారా కాసిన రెస్క్యూ టీమ్స్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి పెద్దపులిని పట్టుకున్నారు. వాడు పడ్డ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్స్ ను పెట్టడంతో పెద్దపులి బయటకు వచ్చింది. ఇంతలోనే గురి చూసి మత్తు ఇంజక్షన్ ను గన్ తో షూట్ చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన పెద్దపులిని బోన్ లో వేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు.
* సజీవంగా పట్టుకునేందుకు..
ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఒకానొక దశలో అధికారులు పాదముద్రికలు సేకరిస్తుండగా.. సమీపంలో నుంచి పెద్దపులి వెళ్లిందని వార్తలు వచ్చాయి. అయితే ఐదు రోజులపాటు ఈ పులి చిక్కకపోవడంతో పూణేలోని రెస్క్యూ టీం ను సంప్రదించింది ఏపీ అటవీ శాఖ. అరుదైన జంతువు కావడంతో పులిని సజీవంగా పట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. చివరకు రెస్క్యూ టీం పని సక్సెస్ అయ్యింది. పెద్దపులి బోనుకు చిక్కింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
