Allu Aravind: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అందుకు ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. అందుకే కొందరు దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా బాధ్యతంతా మీదేసుకున్న నిర్మాత తనకు మంచి లాభం రావాలని ఎంతో మదనపడుతుంటాడు. ఒక్కోసారి సినిమాకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవచ్చు.. కానీ కొన్నిసార్లు అనుకోని లాభాలు రావచ్చు. ఇలా ఏదైనా మిరాకిల్ కొందరి నిర్మాతలకు మాత్రమే జరుగుతుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్న వారిలో అల్లు అరవింద్ అని చెప్పుకోవచ్చు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సినిమాలపై ఆడియన్స్ కూడా నమ్మకం ఉంది. మంచి కథలను మాత్రమే సెలెక్ట్ చేస్తారనే పేరుంది. అయితే ఇప్పుడు ఆయన నేరుగా తెలుగు సినిమాలు కాకుండా డబ్ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ అటు ప్రేక్షకుల చేతి ప్రశంసలు పొందుతూ.. ఇటు ఊహించని లాభాలను తెచ్చుకుంటున్నాడు. అయితే ఇంతటితో ఆగలేదు.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. అదీకూడా హిట్టు కొడితే నక్కతోకను తొక్కినట్లే.

తెలుగు సినిమాల్లో అల్లు అరవింద్ చేసినవి చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినవి ఉన్నాయి.. అలా స్టార్ హీరోలనే కాకుండా విజయ్ దేవరకొండ లాంటి వారితో నూ ‘గీత గోవిందం’ తీసి ది బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. అయితే ఈమధ్య ఈయన నేరుగా తెలుగు సినిమాలు తీసేది తక్కవే. కానీ ఇతర ఇండస్ట్రీల సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడంలో దిట్ట. అలా అని ఎడాపెడా రిలీజ్ చేయడం కాకుండా.. ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారు… అని అనుకుంటనే ఆ సినిమాను తీసుకొస్తారు.
ఇటీవల ‘కాంతారా’ సృష్టిస్తున్న ప్రభంజనం మాటల్లో చెప్పుకునేది కాదు. కన్నడ సినిమా అయినా తెలుగులో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. దీంతో చాలా మంది తెలుగు రైటర్స్ కూడా ఇలాంటి వైవిధ్యమైన కథల వైపు మళ్లుతున్నారు. ఇక ఈ సినిమాను కేవలం రెండంటే రెండు..అంటే రూ.2 కోట్లకు మాత్రమే హక్కులను అల్లు అరవింద్ చేజిక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆయనకు రూ.60 కోట్ల లాభాలు తెచ్చినట్లు తెలుస్తోంది. నేరుగా తెలుగులో సినిమాలు తీసేవారు భారీ బడ్జెట్ పెట్టినా ఎంతో కొంత లాభాలు వస్తాయి. కానీ ఇలా అనూహ్యంగా లాభాలను తెచ్చుకోవడంలో అల్లు అరవింద్ కే సాధ్యమవుతోందని కొందరు అనుకుంటున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈయన మరో బిగ్ ప్రాజెక్టుకు ఎసరు పెడుతున్నాడు. అయితే ఈసారి బాలీవుడ్ పై కన్నేశాడు. హిందీలో ‘బేరియా’ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ , లుక్స్ అదిరిపోయాయి. దీంతో సినిమాపై పాన్ ఇండియా లెవల్లో హోప్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ సినిమాను తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 25న థియేటర్లోకి రానుంది. అయితే ‘కాంతారా’ లాగే ‘తోడేలు’ కూడా అల్లు అరవింద్ కు లాభాల పంట పండుతుందని కొందరు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే ఆయన నక్క తోకను తొక్కినట్లే..