Ramya krishna: కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ. కెరీర్లో వచ్చే చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా తెరపై తిరుగులేని నటిగా ఇప్పటికీ వెలుగుతోంది. బాహుబలిలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత రిపబ్లిక్, రొమాంటిక్ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇప్పుడు లైగర్, బంగార్రాజు చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్లో చేయాలనుకుని కలగా మిగిలిపోయిన పాత్రలతో పాటు.. అనేక విశేషాలను ముచ్చటించింది. ఆ విశేషాలను తెలుసుకుందాం.

తన కెరీర్లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ.. నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్ర ఎంతో స్పెషల్ అని రమ్యకృష్ణ తెలిపారు. మరోవైపు, అమ్మోరు సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత.. ఏదో షూటింగ్లో ఉండగా.. కొంత మంది మహిళలు వచ్చి తన కాళ్లకు మొక్కి వెళ్లడం ఇప్పటికీ గుర్తుందని ఆమె అన్నారు. చాలా మంది హీరోయిన్లు నీలాంబరి పాత్రను చేయాలని అనుకంటారని కాని, తనకు మాత్రం ఓ పాత్ర చేస్తే బాగుండని ఇప్పటికీ అనుపిస్తుంటుందని అన్నారు. అంతఃపురంలోని సౌందర్యలాంటి పాత్ర తన కెరీర్లో ఉన్న కలగా పేర్కొన్నారు.
కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు ఆదర్శమని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటన్నింటిని నిలదొక్కుకుని ఎదిగిన క్రమం ఆమెకు అభిమానిగా చేసిందని తెలిపారు. ఆమెను కలవకపోయినా.. క్వీన్ సిరీస్లో ఆమె పాత్రను చేయడం ఆనందకరమని అన్నారు.