Homeఎంటర్టైన్మెంట్ప్రదీప్‌ సినిమా విడుదలకు మోక్షం లభించిందా?

ప్రదీప్‌ సినిమా విడుదలకు మోక్షం లభించిందా?


కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడం.. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడడంతో మరో మార్గం లేక టాలీవుడ్ సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీల్లో వస్తుండగా దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. తొలుత థియేటర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాలు, చిన్న చిత్రాలు ఓటీటీల వైపు చూడగా ఇప్పుడు బడా నిర్మాతలు సైతం అదే దారి పడుతున్నారు. ఇంటర్నెట్‌ వినియోగం పెరిగి, సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న జమానాలో నిర్మాతలు మొన్నటిదాకా ఓటీటీల పేరు చెబితేనే అంతెత్తున లేశారు. కమల్‌ హాసన్‌, సూర్య లాంటి హీరోలు గతంలోనే డిజిటల్‌ రిలీజ్‌ల ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్యజమానులు ఒక్కటయ్యారు. వాళ్ల తదుపరి సినిమాలకు థియేటర్లు ఇవ్వబోమని బెదిరింపులకు దిగారు. కానీ, ఇప్పుడు ఆ ప్రొడ్యూసరే ఓటీటీల శరణుగోరుతున్నారు. టాలీవుడ్‌ బడా నిర్మాత అల్లు అరవింద్‌ ‘ఆహా’ పేరుతో ఏకంగా ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేయగా.. మరో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆ తర్వాత ‘ భానుమతి అండ్ రామకృష్ణ’, ‘47 డేస్’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాంతో, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఒక్కో సినిమా ఓటీటీల బాట పడుతున్నాయి. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అవడం సాధ్యమయ్యేలా లేదు ఒకవేళ తెరుచుకున్నా కరోనా వ్యాక్సిన్‌ వచ్చేదాకా ప్రేక్షకులు వస్తారని చెప్పలేం. ఇలా అన్ని ఆలోచనలు చేసిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా డిజిటల్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

Also Read: భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్‌’ అమెజాన్‌లో విడుదలైంది. ఇప్పుడు నాని, సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ ‘వి’ సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్‌లోనే లైవ్ స్ట్రీమ్‌ కానుంది. టాలీవుడ్‌ నుంచి ఓటీటీలో రిలీజ్‌ అయ్యే మొదటి పెద్ద సినిమా ఇదే కానుంది. అనుష్క ‘నిశ్శబ్దం’ టీమ్‌ కూడా ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఇలా పెద్ద సినిమాలే ఓటీటీలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో యాంకర్ ప్రదీప్‌ హీరోగా తెరంగేట్రం చేయనున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. చాన్నాళ్ల కిందటే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా రాకతో విడుదల నిరవధికంగా వాయిదా పడింది. హీరోగా ప్రదీప్‌కు ఫస్ట్‌ సినిమా అయినా దీనిపై బాగానే అంచనాలున్నాయి. ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ వీడియో సాంగ్‌ తెగ ఆకట్టుకుంది. ఈ పాటకు ఇప్పటిదాకా 200 మిలియన్ల వ్యూస్‌ (20 కోట్లు) వచ్చాయి. సినిమా రిలీజ్‌ కాకుండానే ఎక్కువ వ్యూస్‌ వచ్చిన దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది. అలాగే, ఒక మిలియన్ పైచిలుకు లైక్స్‌ కూడా లభించాయి. అయితే, సినిమాను థియేటర్లలోనే విడుదల చేద్దామని నిర్మాతలు భావించారు. కానీ, వి లాంటి పెద్ద సినిమాలే ఓటీటీలో వస్తుండడంతో వెనక్కు తగ్గారట. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. డీల్‌ ఓకే అయితే వచ్చే నెలలోనే ప్రదీప్‌ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కానుంది. దాంతో, ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular