Plumber Bank Account 294 Crore: అతడు ఒక ప్లంబర్. పేరు వికాస్ కుమార్.. బీహార్ రాష్ట్రంలోని గయాజి జిల్లా మస్తు పుర గ్రామం. ఇతడు ప్లంబర్ పనిచేస్తూ ఉంటాడు. ఇతడి ఖాతాలో పెద్దగా డబ్బు ఉండదు. ఇటీవల ఒక కస్టమర్ ఇంట్లో పని చేశాడు. ఆ కస్టమర్ వికాస్ కుమార్ ఖాతాలోకి డబ్బును పంపించాడు. అందులో ఇంటి ఖర్చుల కోసం వికాస్ కుమార్ 1300 తీసుకున్నాడు. ఆ కస్టమర్ డబ్బులు ఖాతాలో వేయకముందు వికాస్ కుమార్ అకౌంట్లో కేవలం 113 రూపాయలు మాత్రమే ఉన్నాయి.
కస్టమర్ డబ్బులు పంపించిన తర్వాత ఇంటి అవసరాల నిమిత్తం 1300 తీసుకున్న వికాస్ కుమార్.. తన అకౌంట్ చెక్ చేసుకోగా అందులో 94 కోట్లు ఉన్నట్టు తేలింది. అది కాస్త సాయంత్రానికి 294 కోట్లకు చేరుకుంది. దీంతో ఇంత డబ్బు తన ఖాతాలో ఎలా వచ్చిందో తెలియక అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఏం చేయాలో తెలియక తన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులకు చెప్పాడు. దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఖాకీ అధికారులు దీనిపై ఫిర్యాదు తీసుకున్నారు.. పోలీసులు వెంటనే అతడి ఖాతాను పరిశీలించారు. 94 కోట్లు ఒకసారి.. ఆ తర్వాత 200 కోట్లు జమ అయినట్టు గుర్తించారు.. అయితే ఇంత డబ్బు ఎలా వచ్చింది.. ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు ఇలా నగదు జమ అవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో బ్యాంక్ అధికారులు మళ్ళీ ఫోన్ చేసి డబ్బును తిరిగి స్వాధీనం చేసుకుంటారు.. అలాంటప్పుడు లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఖాతాను స్తంభింప చేస్తారు. వికాస్ కుమార్ విషయంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. తమ దొంగిలించిన డబ్బును ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఇటువంటి ఖాతాలను మ్యూల్ ఖాతాలు అని పిలుస్తుంటారు. తమ దొంగిలించిన డబ్బును ఇలాంటి ఖాతాలకు పంపించి.. ఆ తర్వాత ఆ సొమ్మును వారు డ్రా చేసుకుంటారు. అయితే వికాస్ విషయంలో సైబర్ నేరగాళ్లు ఏమైనా డబ్బులు పంపించారా.. అందువల్లే అతని ఖాతాలో ఆ స్థాయిలో డబ్బు ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వికాస్ కుమార్ బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు సాగుతోందని.. త్వరలోనే అసలు విషయాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.
