Cyber Security: గంట వ్యవధిలో ఫోన్‌ చేస్తే మీ నగదు సేఫ్‌.. సైబర్‌ మోసాలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన..!

టెక్నాలజీ పెరుగుతన్న కొద్దీ మోసాలు పెరుగుతన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు.. సాంకేతిక అభివృద్ధిని మంచి కోసం అందుబాటులోకి తెస్తుంటే.. కొందరు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టెక్నాలజీ సహాయంతో మోసాలకు పాల్పడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 6, 2024 3:31 pm

Cyber Security

Follow us on

Cyber Security: మన దేశంలో సాంకేతిక మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గంతో దొంగతనాలు చేయాలంటే ఇళ్లకు, బ్యాంకులకు కన్నాలు వేసేవారు. కానీ నేడు చదువుకున్న దొంగలు టెక్నాలజీ సాయంతో చోరీలకు పాల్పడుతున్నారు. కన్నాలు వేయకుండానే ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఒక్క మెస్సేజ్‌ లేదా.. ఒక్క ఫోన్‌ కాల్‌తో మనల్ని బురిడీ కొట్టి్టస్తున్నారు. తమకు కావాల్సిన డబ్బులు దోచుకుంటున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకుని లబోదిబో అంటున్నాం. సైబర్‌ మోసాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. చదువుకున్నవారు.. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు వారు కూడా సైబర్‌ మోసాలబారిన పడుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నవారిలో చాలా మంది విదేశీ దొంగలు ఉంటున్నారు. నిమిషాల వ్యవధిలోనే లక్షల రూపాయలు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. తెలంగాణలో గడిచిన మూడు నెలల్లో కోట్ల రూపాయలను సైబర్‌ దొంగలు కొల్లగొట్టారు. అయితే వీటిలో పోలీసులు రూ.85.05 కోట్లును రికవరి చేశారు. సైబర్‌ మోసాలపై అవగాహన కల్పిస్తున్నా ప్రజలు ఏమరపాటులో ఉంటూ.. సైబర్‌ ఉచ్చులో చిక్కుతున్నారు. ఇదే సైబర్‌ దొంగలకు వరంగా మారుతోంది.

రూ.85.05 కోట్లు రికవరీ
తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో వివిధ సైబర్‌ మోసాల బాధితులకు రూ.85.05 కోట్లు తిరిగి అందించింది. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మధ్య సహకార ప్రయత్నంతో భారీగా నగదు రికవరీ సాధ్యమైంది. ఫిబ్రవరి, 2024లో తెలంగాణ లీగల్‌ సెల్‌ అథారిటీ తెలంగాణ సైబర్‌ సెక్యూటిటీ బ్యూరో ద్వారా ప్రామాణిక ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ అభివృద్ధి చేయబడింది. తెలంగాణ సైబర్‌ సెక్యూటరిటీ బ్యూరో క్రియాశీల ఒప్పందాలతో తెలంగాణలోని అన్ని జిల్లా న్యాయ సేవల అధికారులకు దీనిని పంపిణీ చేసింది. ఈ చర్యల అమలు , అన్ని జిల్లా న్యాయమూర్తులకు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి, కోర్టులకు మొత్తం 6,840 పిటిషన్లు సమర్పించబడ్డాయి. 6,449 కేసులకు రీఫండ్‌ ఆర్డర్లు మంజూరు చేయబడ్డాయి, మొత్తం రూ. 85.05 కోట్లు రికవరీ చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లోనే రూ.36.8 కోట్లు రీఫండ్‌ చేయబడింది, రీఫండ్‌ల ప్రాసెస్‌లో టాప్‌ యూనిట్‌గా నిలిచింది. సైబర్‌ మోసం బాధితులకు సత్వర ఆర్థిక సహాయాన్ని అందించడంలో, తెలంగాణలో సైబర్‌ భద్రత , చట్టపరమైన ప్రతిస్పందన కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేయడంలో ఈ చొరవ పెద్ద పురోగతిని సూచిస్తుంది.

గంటలోపు.. ఫిర్యాదు చేస్తేనే
సైబర్‌ మోసానికి గురైన బాధితులు ఘటన జరిగిన గంటలోపే సైబర్‌ సెక్యూరిటీకి ఫిర్యాదు చేయాలి. ఆన్‌లైన్‌ మోసానికి గురైతే భారత ఐటీ చట్టం ప్రకారం దేశంలోని ఏ సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు అయినా ఫిర్యాదు చేయవచ్చు. జ్టి్ట http://cybercrime.gov.in/ వెబ్‌పైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా 1555260 నంబర్‌కు ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌ మోసానికి సంబంధించి పిర్యాదు చేయవచ్చు.

సైబర్‌ కాల్స్‌ వచ్చినప్పుడు ఇలా చేయాలి.,
– గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేర్లతో వచ్చే ఫోన్లకు స్పందించొద్దు.
– టెలీకాలర్స్‌ చెబుతున్న వివరాలన్నీ కచ్చితంగా ఉన్నట్లు భావించినా భయాందోళనకు గురికావొద్దు.
– వీడియోకాల్‌లో అటువైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే.
– ముఖం కనిపించకుండా మాట్లాడేది మోసగాళ్లే.
– మీకు వచ్చే తెలియని కాల్స్, మెస్సేజ్‌లు, లింకులను పట్టించుకోవద్దు.
– మోసపోయినట్లు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్‌ అవర్‌) పోలీసులకు /1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.