Mukesh Ambani Mango Business: నీళ్లలో ఉండే చేప బయటికి రావడానికి అంతగా ఇష్టపడదు. ఒకవేళ వచ్చినా సరే వెంటనే మళ్ళీ నీళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే డబ్బున్న వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు.. ప్రతి దాంట్లో కూడా బిజినెస్ మాత్రమే చూస్తారు. ఎంత పెట్టుబడి పెడితే.. ఎంత లాభం వస్తుంది.. ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది.. అనే అంశాలు మాత్రమే పరిశీలిస్తారు. అందువల్లే వ్యాపారవేత్తలు మానవ సంబంధాలను పెద్దగా పట్టించుకోరు. కేవలం వారికి కావాల్సింది ఆర్థిక బంధాలు మాత్రమే.
మనదేశంలో ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వారంతా కూడా భిన్నమైన రంగాలలో వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తుంటే.. మరికొందరేమో అవసరాలు సృష్టించి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ప్రజల అవసరాలలోనే వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. అటువంటి వారిలో ముకేశ్ అంబానీ ముందు వరుసలో ఉంటారు. పెట్రోల్ నుంచి మొదలు పెడితే టీవీ వరకు.. ఆయన చేయని వ్యాపార అంటూ లేదు. వేల కోట్లు కాదు.. లక్షల కోట్లు దాటినా.. ఆయనకు వ్యాపారంలో మాత్రమే ఆనందం లభిస్తుంది. డబ్బు సంపాదించడంలోనే మజా వస్తూ ఉంటుంది. అందువల్లే వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ముఖేష్ అంబానీ వదులుకోరు. చివరికి మామిడి పండ్లను సైతం తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతి దారుగా అవతరించారు.
మామిడిపండ్లను కార్పొరేట్ వ్యవస్థగా మార్చిన ఘనత ముమ్మాటికి ముకేశ్ అంబానికి దక్కుతుంది. ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో గుజరాత్ లోని జాంనగర్ ప్రాంతంలో ఆసియాలోని అతిపెద్ద మామిడి తోట ఉంది. దీనిని ధీరుబాయ్ అంబానీ లకీ భాగ్ ఆమ్రాయిని అని పిలుస్తుంటారు. ఇది మొత్తం 600 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ గతంలో బీడు భూమి ఉండేది. అందులో విపరీతమైన చౌడు ఉండేది. అనేక రకాలుగా భూసార పరీక్షలు చేసిన తర్వాత ఈ భూమిని మామిడిపండ్ల తోట సాగుకు అనుకూలంగా మార్చారు. ఇందులో ఆల్ఫాన్సో, కేసర్ వంటి భారతీయ ప్రసిద్ధ రకాల తో పాటు టామీ, అట్ కిన్స్ , కిట్, మాయ వంటి అంతర్జాతీయ రకాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 200 పైగా ప్రీమియం రకాలను సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడ 600 టన్నుల అధిక నాణ్యత గల మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.
ఆయిల్ రిఫైనరీ నుంచి కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించేందుకు పర్యావరణహిత కార్యక్రమంగా ఇక్కడ మామిడి చెట్లను పెంచడం మొదలుపెట్టారు. 1997లో ఈ తోటలో మొక్కలు పెంచడం ప్రారంభించారు. ఇక్కడ పండిన మామిడి పండ్లు పూర్తిగా సేంద్రియ విధానంలో సాగవుతూ ఉంటాయి. వీటిని యూరప్.. ఇంగ్లాండ్.. అమెరికా వంటి దేశాలకు ఎమర్జ చేస్తూ ఉంటారు. ఈ మామిడి పండ్లను కేబీ ఎక్స్పోర్ట్స్.. ఆల్ సీజన్ ఎక్స్పోర్ట్స్ వంటి సంస్థలు ఎగమతి చేస్తూ ఉంటాయి. కేవలం మామిడిపండ్ల ఉత్పత్తి మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు మామిడి మొక్కలను ప్రతి ఏడాది ఉచితంగా అందిస్తూ ఉంటారు. ముకేశ్ అంబానీ నిర్ణయం వల్ల అక్కడి రైతులు అత్యంత నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి లాభాలను ఆర్జిస్తూ ఉన్నారు.
