India Billionaires Growth: ప్రపంచంలోనే అధికంగా జనాభా ఉన్న దేశం.. మేధస్సుపరంగా అత్యంత విలువైన యువత ఉన్న దేశం.. వనరులపరంగా.. సాంస్కృతిక వైవిధ్యం పరంగా ప్రపంచానికే పాఠాలు చెప్పే దేశం.. భిన్న వాతావరణాలు.. భిన్న సంస్కృతులు.. భిన్నమైన ప్రజలతో అలరారే దేశం.. ఇంతటి విశేషణం.. విశ్లేషణం కేవలం మన దేశానికి మాత్రమే సొంతం. అందువల్లే ప్రపంచానికి భారత్ ఒక మార్గదర్శి.. దిక్సూచి.
ఇంతటి స్థాయిలో అనుకూలతలు ఉన్నప్పటికీ భారతదేశన్ని ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమనే అంటుంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నప్పటికీ.. భారత్ గొప్ప దేశం. శాస్త్ర సాంకేతికతలనుంచి మొదలుపెడితే.. వ్యవసాయం వరకు భారత్ ఇప్పటికీ తన విభిన్న తత్వాన్ని నిరూపించుకుంటూనే ఉంటుంది.
అవినీతి, ఇతర వ్యవహారాల వల్ల ఇప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశం గానే భారత్ ఉండిపోతోంది. అయినప్పటికీ మన దేశంలో శ్రీమంతుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ మనదేశంలో ఉన్న ఆగర్భ శ్రీమంతుల సంఖ్యను లెక్క కట్టింది. 2031 నాటికి మనదేశంలో 313 మంది బిలియనీర్లు ఉంటారని పేర్కొంది. ఈ జాబితాలో ఒక్కో వ్యక్తి 100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించుకుంటారని ఆ సంస్థ ప్రకటించింది . 2026 లో 207 మంది బిలియనీర్లు మనదేశంలో ఉన్నారు. ఆ సంఖ్యతో పోల్చి చూస్తే 2031 నాటికి 51 శాతం శ్రీమంతులు పెరిగే అవకాశం ఉంది. చైనాలో 20%.. అమెరికాలో 12% శ్రీమంతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ది వెల్త్ రిపోర్టులో ఆ సంస్థ ఈ నివేదికను వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న వ్యాపారాలు.. ఇతర వ్యవహారాల వల్ల ప్రతిరోజు ప్రపంచంలో 89 మంది ఆల్ట్రా రిచ్ (30 మిలియన్ డాలర్ల సంపద) గా మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3,110 మంది బిలియనీర్లు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 3,915 కి పెరుగుతుందని సమాచారం. “ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. విభిన్నమైన వ్యాపారాలు చేసేవారు తమ సంపదను పెంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మారిపోతున్న క్రమంలో.. కొంతమంది ప్రత్యేకమైన వ్యాపారాలు చేస్తున్నారు. అందువల్ల వారు తమ సంపాదనను పెంచుకుంటున్నారు. అందువల్లేవారు ఈ స్థాయిలో శ్రీమంతులుగా మారిపోతున్నారని” నైట్ ఫ్రాంక్ సంస్థ ది వెల్త్ రిపోర్టులో పేర్కొంది.
