YSRCP declining strength: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హవా తగ్గుతోంది. 2024 జూన్ లో ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ స్థానిక సంస్థల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం కొనసాగింది. ఆ పార్టీకి చెందిన వారే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లుగా ఉండేవారు. వార్డు కౌన్సిలర్లతోపాటు కార్పొరేటర్లు కొనసాగే వారు. కానీ వారు ఈనెల 17న మాజీలు అయ్యారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో పంచాయతీ సర్పంచులు కూడా మాజీలు కానున్నారు. వారి పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో వారు సైతం మాజీలు కానున్నారు. ఇక మిగిలింది ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు. జూన్ వరకు వారి పదవీకాలం ఉంది. అయినా సరే ప్రత్యేక అధికారుల పాలన రావడంతో వారు సైతం ఉత్సవ విగ్రహాలే. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం పూర్తిగా పోయినట్టే. మరోవైపు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండడంతో కూటమి నేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చ.
అప్పట్లో ప్రలోభాల పర్వం..
2021లో వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కనీసం అప్పట్లో టిడిపి కూటమి నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు. మండలాలకు మండలాలు ఏకగ్రీవం అయిపోయాయి. ప్రలోభాలతో పాటు బెదిరింపులు సాగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరగకూడదో అలానే జరిగాయి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయో కూడా తెలుసు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ బరిలో ఉంటుందా? లేదా? అనేది ఒక అనుమానమే. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కచ్చితంగా స్థానిక ఎన్నికల బరిలో ఉంటామని సంకేతాలు ఇస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అది అంత సులువుగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్చార్జిలు అంత సుముఖంగా లేరు. స్థానిక ఎన్నికల ఖర్చులు వైసీపీ నేతలు భరించుకోవాల్సి ఉంటుంది. అందుకే వారు పెద్దగా ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
Also Read: వీర సైనిక కుటుంబం విన్నపం.. స్పందించే గుణం పవన్ ది
ఆ వ్యూహంతోనే..
స్థానిక ఎన్నికల నుంచి ఆది నుంచి తప్పుకుంటామన్న ప్రకటన ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం పోతుందని.. అందుకే గట్టిగా నిలబడాలన్న పిలుపు ఇచ్చారని తెలుస్తోంది. తీరా ఎన్నికలు సమీపించిన సమయంలో అధికార పార్టీ వైఖరి పేరుతో ఎన్నికలను బహిష్కరించాలన్నది వైసిపి ఆలోచనగా సమాచారం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. స్థానిక ఎన్నికల ప్రస్తావన చేయడం లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం స్థానిక ఎన్నికలకు ఆ పార్టీ సుముఖంగా లేదని అర్థమవుతుంది. అలాగని ఇప్పుడే ప్రకటిస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాయకత్వం భయపడుతున్నట్లు సమాచారం. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి వాటిలో వైసిపి బరిలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలను మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ అనే అస్త్రం ప్రయోగించనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..