YSR Congress Party: రాజకీయాల్లో ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఒంటరి పోరాటం ప్రకటనలే చేస్తూ ఉంటుంది. సింహం సింగిల్ అంటూ చెబుతూ వస్తోంది. అయితే భవిష్యత్తులో కూడా దీనికే కట్టుబడి ఉండాలి. అయితే రాజకీయాలు గతం మాదిరిగా లేవు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేం. వాటితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడు సింగిల్ గానే పోటీ చేస్తాం.. సింహం సింగిల్ గా వస్తుంది.. తమ పార్టీని చూసి విజయ్ ఒంటరి పోరాటానికి వెళ్లి సక్సెస్ అయ్యారంటూ చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఆ పార్టీ సోలోగా మిగిలిపోనుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వేరే పార్టీతో కలిస్తే మాత్రం.. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే ఇప్పటివరకు సింగిల్ పార్టీ అంటూ ప్రకటనలు చేసింది. అంతటితో ఆగకుండా తమ మాదిరిగానే సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ చేస్తూ వచ్చింది.
* పెద్ద పెద్ద పార్టీలు సైతం..
ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా ఎన్నికల విషయానికి వచ్చేసరికి చాలా రకాల వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా పొత్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. పెద్ద పెద్ద పార్టీలు సైతం పొత్తులు పెట్టుకున్నాయి. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి పొత్తులు పెట్టుకున్నారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీని ఓడించగలిగారు. ఎప్పుడు ఏ పార్టీ అవసరం వస్తుందో నేటి రాజకీయాల్లో చెప్పలేం కూడా. కానీ మేము సింగిల్ గానే ఉంటాం.. సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది అని అన్న మాటలు రాజకీయాల్లో పనికిరావు కూడా. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం మేలు. కనీసం వామపక్షాలతోనైనా వెళితే ప్రజా ప్రయోజనాలు విషయంలో వారి పోరాటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చుతుంది.
* కూటమిని ఢీ కొట్టాలంటే..
ఏపీలో కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. మూడు పార్టీలు బలంగా ఉన్నాయి కూడా. ఇటువంటి సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం అంటే ఆ పార్టీకి నష్టమే. ఎందుకంటే కచ్చితంగా వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ కలిసి వెళుతుంది. బహుముఖ పోటీ తప్పదు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టం అధికం. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు ముందుకు వచ్చినా.. ఆ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్స్ కావడం ఖాయం. ఎందుకంటే ఇన్నాళ్లు తమను తాము సింహంగా పోల్చుకుంటూ.. ఎవరైనా పొత్తులు పెట్టుకుంటే ఎద్దేవా చేస్తూ కాలం వెళ్లదీసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కచ్చితంగా అవసరం రీత్యా పొత్తులు పెట్టుకున్న ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు.