YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయస్థాయిలో పార్టీ స్టాండ్ విషయంలో కొంతమంది సీనియర్లు అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. బిజెపితో స్నేహం.. కాంగ్రెస్ పార్టీతో కయ్యం.. తటస్థ వైఖరి.. ఇండియా కూటమికి దూరం.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం.. జాతీయస్థాయిలో ఎన్డీఏకు సానుకూలం.. ఇలా ఈ పరిణామాలతో వైసిపికి డ్యామేజ్ జరుగుతుందని కొంతమంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటికీ చెక్ పడాలంటే బిజెపికి వైసీపీ దూరం అనే స్పష్టత ఇవ్వాలి అని ఇప్పుడు సీనియర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.
* వైసీపీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి బిజెపి విషయంలో సానుకూలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేసరికి బిజెపి కేంద్రంలో అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేశారు కాబట్టి.. అదే కాంగ్రెస్ కు బద్ధ శత్రువుగా ఉన్న బిజెపి సానుకూలంగా మారిపోయింది. అసలు బిజెపికి పూర్తి వైరుధ్య సిద్ధాంతాలతో వైసిపి ఉంది. అయినా సరే మధ్యలో కాంగ్రెస్కు ఇద్దరూ వ్యతిరేకం కాబట్టి ఒక్కటయ్యారు. అలాగని భిన్న సాంప్రదాయ ఓటర్లు రెండు పార్టీలకు. ఇద్దరూ కలిసేందుకు కుదరదు. అందుకే పరోక్ష సహకారం తీసుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
* డిఫెన్స్ లో టిడిపి..
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అందులో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. అయినా సరే వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడింది. ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. కానీ అలా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డిని ప్రయోగించి జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అది మొదలు ఇప్పటివరకు స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఎంతవరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దలను కలుస్తున్నట్లు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఏదైనా అడగాలి అనుకుంటే సాయి రెడ్డిని అడగండి అంటూ మీడియా ప్రతినిధులకు సూచించేవారు
. అయితే ఇంతవరకు బిజెపితో పరోక్ష స్నేహం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. మైనారిటీలతో పాటు దళితుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే బిజెపిని వదిలాల్సిన పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి పై ఏర్పడింది.
* తెంచుకోవాల్సిందే..
ప్రస్తుతం బిజెపితో స్నేహం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే లాభం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పై కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిజెపితో ఎటువంటి ప్రయోజనం వచ్చే అవకాశం లేదు. పార్టీకి ప్రయోజనం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి బిజెపితో పరోక్ష స్నేహాన్ని కూడా వదులుకోవాల్సిందేనని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. ఒకరిద్దరు నేతలు అయితే ఈ విషయంలో కరాకండిగా ఉన్నారు. అలా చేయకుంటే పార్టీని కూడా విడిచిపెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
