YSRCP: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కూటమి రెండేళ్ల పాలనపై వెన్నుపోటు అనే ముద్ర వేసి నిన్ననే ఆందోళన కార్యక్రమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే పాలనతో పాటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూటమి వైఫల్యం చెందిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఒక ప్రతిపక్ష పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణ చేయడంలో తప్పులేదు. కానీ ఈ రెండేళ్లలో విపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత సక్సెస్ అయ్యింది? ఎంత పనితీరు కనబరిచింది? అనే దానిపై మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ 2.0 కోసం ఆయన చేస్తున్న రాజకీయాలకు ప్రజామోదం ఉందా? కూటమిపై చేస్తున్న విమర్శలకు ప్రజలు హర్షిస్తున్నారా? అన్నది మాత్రం గమనించుకుంటే మంచిది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చి ఆయన చాలా మాటలు చెబుతున్నారు. ఆ మాటలను ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారా? లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకు అనుగుణంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.
* మారిన రాజధానుల స్టాండ్..
రాజధానుల అంశాన్ని తీసుకుందాం. అసలు రాష్ట్ర రాజధానిపై మూడు మొక్కలు ఆడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తొలుత విశాఖ రాజధాని అన్నారు జగన్. తరువాత మాట మార్చి మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే దీనిని ప్రజలు సమర్ధిస్తున్నారా అనే విషయాన్ని జగన్ గుర్తించాలి. మద్యం స్కాం నుంచి తిరుమల లడ్డు కల్తీ వరకు వైసిపి ఎదుర్కొంటున్న కేసులు, ఆరోపణలను ప్రజలు మరిచిపోయే అవకాశం ఉంటుందా? పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి వస్తున్న బెదిరింపులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి జగన్ చేస్తున్న హెచ్చరికలను ప్రజలు స్వాగతిస్తున్నారా? అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
* ప్రజలు విశ్వసిస్తున్నారా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రప్ప రప్ప అనే నినాదాలు చేస్తున్నాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సమర్థించారు. అయితే వాటిని ప్రజలు విశ్వసిస్తున్నారా? అనేది తెలుసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది. గత ఎన్నికలకు ముందు వై నాట్ 175 అన్న నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ 2.0 అనే నినాదాలు ఇస్తున్నారు. వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాదిరిగానే 2.0 నినాదం మిగిలిపోతుందన్న విషయాన్ని వైసిపి గ్రహించాలి. గతంలో తన పార్టీ నేతల బూతు రాజకీయాన్ని ప్రజలు సమర్థిస్తారని భావించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే బూతు నేతలు మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. మళ్లీ ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నట్టు ఉన్నారు.
* బలపడడం అంటే…
బలపడ్డం అని తాము అనుకోకూడదు. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు మౌనంగా ఉన్నారని, ప్రభుత్వం వెతక వైఖరి అవలంబిస్తుంది అని వైసిపి ఎప్పటికీ తమదే పైచేయి అని భావిస్తోంది. అయితే ఆ ఆలోచన అజ్ఞానమే అవుతుంది. అసలు ప్రజలు ఏమి అనుకుంటున్నారో దానిని ముందుగా గ్రహించాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని వైసిపి పైశాచిక రాజకీయ క్రీడ నుంచి బయటకు రావాలి. నిన్నటి వైసిపి పతనం ఈవీఎంల పుణ్యమే అని చెబుతున్న జగన్.. రేపు అధికారంలోకి వస్తే అదే ఈవీఎంలను సమర్ధించకూడదు. ఒక్కటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ క్యాడర్ వరకు కూటమి గెలుపును జీర్ణించుకోలేకపోతోంది. దానిని అధిగమించేందుకు జనాలతో పాట్లు పడుతుంది. అయితే నమ్ముకోవాల్సింది జనాన్ని కానీ.. జనాలతో ప్రదర్శన మాత్రం కాదు. అది ఎంత మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఫలితం ఇవ్వలేదు. ఆ విషయం గ్రహిస్తే ఎంతో మేలు.

