YSRCP Rajya Sabha Strength Reduction: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 18న పోలింగ్ జరగనుంది. అయితే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదు. ఈ నాలుగు పదవులను కూటమి పార్టీలు పంచుకోనున్నాయి. అయితే ఇప్పటివరకు రాజ్యసభలో ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు సభ్యుల బలం తగ్గనుంది. దీంతో నాలుగు స్థానాలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిగలనన్నాయి. అదే టైంలో కూటమికి రాజ్యసభలో బలం ఏడింటికి చేరనుంది.
నాలుగుకు పడిపోనున్న బలం..
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం 11 మంది ఎంపీలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 మంది సభ్యులతో బలీయమైన శక్తిగా ఉండేది.. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆ పార్టీ బలం 11 మంది రాజ్యసభ సభ్యులు. సంపూర్ణ బలంతో ఉన్న ఆ పార్టీకి అప్పట్లో ఉపశమనమే. రాష్ట్రంలో శాసనమండలి, కేంద్రంలో రాజ్యసభ ద్వారా రాజకీయం చేయదలచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో కూటమి వచ్చిన తర్వాత చాలామంది రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాకు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏడుకు తగ్గిపోయింది. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం రాజీనామా చేశారు. మిగిలిన ఏడింటిలో ముగ్గురు సభ్యులు ఇప్పుడు పదవి విరమణ చేస్తున్నారు. దీంతో వైసిపి బలం నాలుగుకు పడిపోనుంది. అదే సమయంలో కూటమి బలం ఏడుకు చేరుకోనుంది.
రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీల బలం..
తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో వైసిపి శాసనమండలితో పాటు రాజ్యసభలో మెజారిటీ పెంచుకుంటూ వచ్చింది. అదే రాజ్యసభ బలంతో బిజెపికి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు బిజెపికి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దక్కనుండగా.. ఏపీ నుంచి భర్తీ అయ్యే రాజ్యసభ సీట్లు కూటమి ఖాతాలో పడనున్నాయి. వైసిపి బలం తగ్గిపోయి కూటమి బలం పెరగనుంది. దీంతో జాతీయ స్థాయిలో సైతం వైసీపీ బలం తగ్గిపోతోంది. ఇది ఆ పార్టీకి కాస్త మైనస్.
