Site icon OkTelugu

YS Jagan Mohan Reddy: వైసీపీ నేతల గుండెల్లో మావి’గన్’!

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో జరుగుతాయని తేల్చి చెప్పారు. అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ ఇకనుంచి మావిగన్ స్టాండ్ మీద మాట్లాడాలని రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి. భవిష్యత్తులో మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుకొని మావిగన్ రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పాలని వైసీపీ శ్రేణులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. మావిగన్ ప్రతిపాదనకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే వైసీపీ నేతలు తలెత్తుకోలేకపోతున్నారు.

* ఇప్పుడు ఎలా చెబుతాం..
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని చెప్పారు. విశాఖ పాలన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మావిగన్ అంటే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజలకు చెప్తామని ధర్మాన ప్రసాదరావు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ వైసిపి నేతలకు ఈ విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి మావిగన్ అంటే ప్రజలు నవ్వుతారని.. వెటకారం చేస్తారని చెప్పుకొస్తున్నారు. అందుకే ప్రజలకు తాము చెప్పలేమని తేల్చి చెబుతున్నారు.

* విద్యాధికుల అభ్యంతరం..
సమాజంలో చీలిక తేవాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఇది అని మేధావులు తేల్చి చెబుతున్నారు. అమరావతి రాజధానిపై ఇంకా విషం చిమ్మడం అంత మంచిది కాదు అని సూచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వినే రకం కాదు. కచ్చితంగా ఆయన మావిగన్ పైనే ముందుకు వెళ్తారు. అయితే ఆయన నుంచి వచ్చే కామెంట్స్ ఇప్పుడు మరి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మావిగన్ మా స్టాండ్ అని చెబుతూనే విజయవాడ మా రాజధాని అంటూ నిన్నే మాట్లాడారు. ఒకవైపు అమరావతి రాజధాని పనులు జరుగుతుండగా.. ఇలా రాజధానిని మార్చేస్తామని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన కొన్ని వర్గాల్లో ప్రభావం చూపిస్తుందని వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. అందుకే మావిగన్ విషయంలో ప్రజలను కన్వెన్స్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.

Exit mobile version