YSRCP And DMK: తమిళనాడులో డిఎంకెతో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సారూప్యత ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే తమిళనాడులో డీఎంకే కూడా ఓటమి చవిచూసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మాత్రం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. డీఎంకే గౌరవప్రదమైన స్థానాలు సాధించింది. అయితే డిఎంకె ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. తమ హయాంలో జరిగిన మంచి పనులు కంటే.. తప్పుడు విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పైగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నోటి దూల ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి నోటి దూల కలిగిన నేతలతోనే ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది.
* అడ్డదిడ్డంగా మాట్లాడి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది. ఆ సమయంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఏమయింది కొత్త విగ్రహం పెడతాం కదా అని చాలా తేలిగ్గా మాట్లాడారు. రథం దగ్ధమైతే మళ్లీ కొత్త రథం ఏర్పాటు చేస్తాం అన్నట్టు వ్యాఖ్యానించారు. కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే జైలులో దోమలు కుడుతున్నాయని చెబితే.. ఆయన కోసం రంభ ఊర్వశిలు వస్తారా అని ఎద్దేవా చేశారు కూడా. అయితే ఇటువంటి ఘటనలు తటస్థ ఓటర్ల పై ప్రభావం చూపిస్తాయి. ఏపీలో అటువంటి ప్రభావం కనిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై. అందుకే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అచ్చం అలానే వ్యవహరించింది తమిళనాడులో డీఎంకే.
* మెరుగైన పాలన అందించినా..
అయితే ఏపీతో పోల్చుకుంటే తమిళనాడులో మెరుగైన పాలన అందించింది డిఎంకె ప్రభుత్వం. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. పెట్టుబడులు కూడా పెరిగాయి. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ మతపరంగా చేసిన కామెంట్స్ తో హిందూ మతం పూర్తిగా దూరమైంది. పైగా కొన్ని మీడియా సంస్థలు సైతం ఆయనకు దూరమయ్యాయి. ఏపీలో కూడా పరిస్థితి అదే. సాక్షితోపాటు అనుకూల మీడియాలను నమ్ముకొని ఏది పడితే అది మాట్లాడేసారు. అడ్డగోలుగా సమర్థించుకున్నారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు కూడా. ప్రధానంగా తాము మంచి చేసాం అని మాత్రమే బలంగా నమ్మారు. కానీ తమ పార్టీలో అస్తవ్యస్త విధానాలను మాత్రం నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఓటమి.