YCP Social Media Politics: “పోలైన ఓట్లు.. లెక్కించిన ఓట్లు సమానం కాలేదు. అర్ధరాత్రి పూట నమోదైన పోలింగ్ ను వేరువేరు శాతాలలో చూపించారు. అర్ధరాత్రి పూట పోలింగ్ ఆస్థాయిలో ఎలా నమోదు అవుతుంది. ఈవీఎం లు మొత్తం వారి ఆధీనంలో ఉన్నాయి. కొన్నిచోట్ల నమోదైన ఓట్లకు.. లెక్కించిన ఓట్లకు సంబంధం లేకుండా పోయింది. ముమ్మాటికి ఇది ఈవీఎంల ద్వారా సాధించిన గెలుపు. ప్రజల్లో మాకే బలం ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. మేము అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. దీనిపై పోరాటం చేస్తామని” వైసీపీ నేతలు 2024 నుంచి ఇప్పటివరకు చెబుతూనే ఉన్నారు.
తమ మీడియాలో ప్రభుత్వం మీద రెచ్చిపోతున్న వైసిపి నాయకులు.. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు.. క్షేత్రస్థాయిలో మాత్రం పీచే మూడ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మాత్రమే వైసిపి నాయకులు పులులు.. క్షేత్రస్థాయిలో కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ మీద ఇటీవల విపక్షాలు అభిశంషన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 130 మంది ఎంపీలు.. 60 మంది రాజ్యసభ సభ్యులు దీనిపై సంతకం చేశారు. ఈవీఎం మాయాజాలంతో ఎన్నికలు జరిగాయని.. తీర్మానంలో సభ్యులు పేర్కొన్నారు. ఈ తీర్మానంపై వైసీపీ నేతలు ఒక్కరు కూడా సంతకం చేయలేదు. ఎన్నికల సంఘంపై.. ఈవీఎం లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించిన విధానంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే దేశంలో ప్రతిపక్షాలు రాసిన తీర్మానంపై వైసీపీ నేతలు సంతకాలు చేయలేదు. కనీసం సొంత మీడియాలో దీనిపై ఒక వార్తను కూడా ప్రసారం చేయలేదు.
“సోషల్ మీడియాలో మొరిగితే ఉపయోగమేముంటుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ తీర్మానం మీద తన ఎంపీలతో.. రాజ్యసభ సభ్యులతో సంతకం చేయించాలి. అంత దమ్ము ఉందా.. కచ్చితంగా లేనేలేదు. అది గనక ఉండి ఉంటే సంతకం చేయాలి. లేకుంటే సోషల్ మీడియాలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడకుండా నవరాంద్రాలు మూసుకొని కూర్చోవాలని” కూటమి నేతలు చెబుతున్నారు. “2019లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. నాడు ఈవీఎంలు ఆ పార్టీ నేతలకు ఆనందంగా అనిపించాయి. ఇప్పుడు ఆ ఈవీఎంలు శత్రువులుగా మారిపోయాయి. 2024లో జరిగిన ఎన్నికలలో ఓటమి ఎదురైన తర్వాత ఆ పార్టీ నేతలకు ఈవీఎంలు శత్రువులుగా మారిపోయాయని” కూటమి నేతలు అంటున్నారు.
