YSR Congress Kapu Community Strategy: పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాపు సామాజిక వర్గం మద్దతు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏ చిన్న అవకాశం చిక్కినా కాపులను వోన్ చేసుకోవాలని చూస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కాపులను దూరం చేసుకుని భారీగా మూల్యం చెల్లించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పవన్ తో కాపులు వెళ్లిపోతున్నారని తెలిసినా.. ఇతర వర్గాల ద్వారా ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాపులు దూరమయ్యారు. ఇతర వర్గాల వారు ఆదరించలేదు. దీంతో కాపుల విలువ తెలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు రాజకీయం మొత్తం కాపుల చుట్టూ నడుపుతోంది వైసిపి.
* అంబటి అరెస్ట్ ఎపిసోడ్ తో..
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు పై తిట్టినందుకుగాను అంబటి రాంబాబును( ambati Rambabu) అరెస్టు చేశారు. కానీ ఆ ఎపిసోడ్ ను తన కాపు రాజకీయం కోసం వాడుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంబటి రాంబాబును పరామర్శించేందుకు కాపు నేతలు క్యూ కట్టారు. ఆయన విడుదల సమయంలో స్వాగత కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. ఆయన కుటుంబానికి కాపు నేతల పరామర్శ కూడా ఎక్కువైంది. తాజాగా అంబటి రాంబాబును పరామర్శించేందుకు ఒకప్పటి కాపు నేత ముద్రగడ పద్మనాభం సైతం వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
* వేరే ఆప్షన్ లేక..
అయితే అంతా ఓకే. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కాపు నేతలకు కొదువ లేదు. పైగా వారికి వేరే ఆప్షన్ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ని వారు ఆరాధిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దాకైనా వెళ్తారు. అయితే ఇప్పుడు వైసీపీలో నెంబర్ వన్ కాపు నేత కోసం పోటీ మరీ ఎక్కువైంది. కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు ముద్రగడ పద్మనాభం. ఆయన ఉద్యమం కాపులకు రిజర్వేషన్లు తెచ్చి పెట్టలేదు కానీ.. టిడిపి పట్ల కాపుల్లో వ్యతిరేకత పెంచడానికి కారణమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని ఆపివేసి.. వైసీపీలో చేరి.. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేసి.. ఆ ప్రయత్నంలో విఫలమై తన పేరు మార్చుకున్నారు. ఇప్పుడు మరోసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని శపధం చేశారు.
* ఫర్ఫార్మెన్స్ నచ్చితేనే
ఇక మరో మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ) కాపునేతగా ప్రొజెక్ట్ అయ్యేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. ఆయన తనకు తానే జగన్మోహన్ రెడ్డికి పెద్ద పాలేరుగా చెప్పుకుంటారు. జగన్ కోసం పవన్ పై నిత్య విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే జగన్తో వెరీ గుడ్ అనిపించుకోవడం కోసం గుడ్డు మంత్రిగా ట్రోలింగ్ కు గురైన గుడివాడ అమర్నాథ్ సైతం కాపు నేతగా వైసీపీలో గుర్తింపు కోసం పోటీలో ఉన్నారు. ఇక చివరిసారిగా తాను రేసులో ఉన్నానని ముందుకు వచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై తిట్టినందుకుగాను ఆయనకి ఇచ్చిన ట్యాగ్ కాపు టైగర్. అయితే ఈ వైసీపీ కాపు నేతలంతా ఒకే ఒక్క సమయంలో మాత్రమే వస్తారు. సాటి కాపు నేతల పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఎవరికి వారే సాటి. అయితే ఈ నలుగురి మధ్య గట్టి పోటీ ఉంది వైసీపీలో కాపు నేతల్లో నెంబర్ వన్ స్థానం కోసం. అయితే వీరి పెర్ఫార్మెన్స్ ఎంతలా ప్రత్యర్థులపై ఉంటే.. అంతలా గుర్తిస్తారు అధినేత జగన్మోహన్ రెడ్డి.