YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే చాలు.. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ దర్శనం ఇస్తుంటాయి. నిన్ననే ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరోసారి అదే తడబాటుతో అడ్డంగా బుక్కయ్యారు. అప్పటినుంచి సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. గతంలో నారా లోకేష్ విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఇలానే టార్గెట్ చేసేది. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడుతారా.. ఎలా ట్రోల్స్ చేయాలా అని చూసేది. కానీ ఇప్పుడు అదే ట్రోల్స్ కు బాధితుడు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మానవీయ కోణం అనలేక.. పక్కన ఉన్నవారు ప్రామిటింగ్ ఇవ్వడంతో అతి కష్టం మీద సర్దుకుని మాట్లాడారు.
* మాట్లాడకుండా ఉండడమే మంచిది..
జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయాలి. అచ్చ తెలుగు వ్యాఖ్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రెస్మీట్లో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు. తనకు తెలుగు పెద్దగా తెలియదని మళ్లీ చెప్పుకొస్తారు. కానీ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు చాలా సీరియస్ గా ఉంటుంది పరిస్థితి. ఆవేశపూరితంగా మాట్లాడారు. ఆ మాటల్లోనే తప్పులు ధ్వనించాయి. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్స్ వీర లెవెల్లో దర్శనం ఇస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉండడమే మేలని సొంత పార్టీ వారే వ్యాఖ్యానించే దాకా పరిస్థితి వచ్చింది. అసలు ఆయన అచ్చ తెలుగు ఎందుకు మాట్లాడాలి? అడ్డంగా ఎందుకు బుక్ కావాలి? అన్నవారు కూడా ఉన్నారు.
* అప్పట్లో లోకేష్ టార్గెట్..
వాస్తవం మాట్లాడుకుంటే.. ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నారా లోకేష్ ను ఏ విధంగా టార్గెట్ చేశాయో తెలియంది కాదు. విదేశాల్లో చదువుకొని వచ్చిన నారా లోకేష్ అప్పట్లో తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు. ఆయన ఎప్పుడు మీడియా ముందు మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురు చూసేవారు. చివరకు మాజీ మంత్రి రోజా లాంటి వారు సైతం.. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తామని సిద్ధపడగా.. ఒకసారి మంగళగిరి అని లోకేష్ వ్యాఖ్యానిస్తే చాలు అన్నంత రీతిలో టార్గెట్ చేశారు. చివరకు లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా వేలమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆయనను అనుసరించారు. అయితే ఇప్పుడు అదే లోకేష్ పరిణితి తో మాట్లాడుతున్నారు. తెలుగు చాలా అలవోకగా చెప్పేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏవేవో మాట్లాడుతూ.. నోరు తిరగని వ్యాఖ్యలు చేస్తూ.. అడ్డంగా బుక్ అవుతుండడంతో వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.

