YS Jagan public events: వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Y S Jagan Mohan Reddy ) పాటలు అంటే ఎంతో ఇష్టం. అలా పాటలు పాడి పొగుడుతుంటే ఆయన పరవశించిపోతారు. అప్పుడెప్పుడో అసెంబ్లీలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధర్మ శ్రీ పాటలతో, చిన్నపాటి పద్యాలతో జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు. రాజశేఖరన్న అంటూ ఓ మహిళా నాయకురాలు తులాభారం వేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి పై పాట పాడారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి సెట్టులో.. తుఫాను తలొంచి చూస్తే అంటూ పాడిన పాటకు జగన్మోహన్ రెడ్డి పరవశించిపోయారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ పర్యటనల్లో ఇటువంటి పాటలు కార్యకర్తల నోటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల నెల్లూరు పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఓ నేత పాటాభిషేకం చేశారు. కానీ ముసి ముసి నవ్వులతో జగన్ పాట పాడిన వ్యక్తిని సముదాయించారు.
ప్రజల్లోకి వెళ్లిన పాటలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ శ్రేణులు ఎంతగానో కృషి చేశాయి. అంతకుమించి వైసిపి పై రూపొందించిన పాటలు దోహదపడ్డాయి. మా నమ్మకం నువ్వే జగన్.. రావాలి జగన్ కావాలి జగన్.. జగనన్న అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా.. మడమ తిప్పని నేత అంటూ కీర్తిస్తూ పాడిన పాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. 2014 కంటే 2019 ఎన్నికల్లో ఈ పాటలు బాగా పనిచేశాయి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఏ పాటలు పనిచేయలేదు.
వ్యక్తిగత భజనే అధికం..
అయితే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత భజన చేసే నేపథ్య గాయకులు ఎక్కువైపోయారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పోర్టుల సందర్శనకు జగన్మోహన్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి పాట పాడడం ప్రారంభించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తో పాటు పక్కనే ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పాట వద్దని సముదాయించే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి వినలేదు. అదే పనిగా జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ పాట పాడాడు. కానీ నవ్వుకుంటూ చేసేదేమీ లేక జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి ముందుకు సాగారు. మొత్తానికి అయితే ఈ పాటల బృందం జగన్ చుట్టూ చేరి చిన్నపాటి ఇబ్బంది సృష్టిస్తోంది. కానీ జగన్ మాత్రం ఇబ్బందిగా ఫీల్ కావడం లేదు.