YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అధికారంలో ఉన్నన్ని రోజులు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు వారాంతపు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. గంటల తరబడి మీడియాతో మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కానీ ఆయనకు మీడియా గుర్తుకు రాలేదు. అయితే ఒక పని చేసేవారు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేషనల్ మీడియాకు పిలిపించుకొని మాట్లాడేవారు. ఒకటి రెండు నేషనల్ మీడియా సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జాతీయ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అనుకూల కథనాలు పెద్దగా కనిపించడం లేదు. ఇది అంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో నేషనల్ మీడియా అమరావతికి అనుకూలంగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు ప్రచురించింది. దీంతో నేషనల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. జాతీయ మీడియా అంత అవినీతిమయంగా మారిపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. అయితే ఆలస్యంగా గుర్తించాయి జర్నలిస్ట్ సంఘాలు.
* తెలుగు మీడియాకు దూరం..
స్వతహాగా మీడియా అధినేత జగన్మోహన్ రెడ్డి. పైగా అధికారంలో ఉన్నప్పుడు తెలుగు మీడియాకు సంబంధించిన ప్రధాన చానళ్లు వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవి. అదే సమయంలో టిడిపి అనుకూల మీడియా సైతం బలంగానే ఉంది. అయినా సరే ఎప్పుడూ తెలుగు మీడియాతో మాట్లాడే వారు కాదు జగన్మోహన్ రెడ్డి. నేరుగా నేషనల్ మీడియాకు పిలిపించుకొని ఏదైనా విషయాన్ని చెప్పేవారు. ఏ అంశంపై నైనా కౌంటర్ ఇవ్వాలంటే నేషనల్ మీడియా ఉండాల్సిందే. జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రచారానికి ఒకటి రెండు మీడియా చానళ్లతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే అధికారం కోల్పోయిన తర్వాత.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాక.. అపసవ్య నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేషనల్ మీడియా గుర్తించి కథనాలు ప్రచురిస్తోంది. ఇది అంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదు. అందుకే నేషనల్ మీడియా అంతా అవినీతిమయం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
* ఆ రోజున హాట్ కామెంట్స్..
పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అదే రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అదే రోజు నేషనల్ మీడియా పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆరోజు పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత జర్నలిస్ట్ సంఘాలు గుర్తించాయి. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సహా పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి అణచివేతకు ప్రయత్నం చేశారు. స్వతహాగా మీడియా సంస్థలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి అదే మీడియాపై చులకన భావం ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు రాలేదన్న కోపంతో ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు ఈ పరిణామం మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.