YCP political strategy changes: వైయస్సార్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. నిన్న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని.. ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జిలపై వేటు పడుతుందని హెచ్చరించినంత పని చేశారు. అయితే అక్కడే ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు.. బాధ్యతలు చూస్తున్న తమపై కాదు.. ఆ కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి అన్నట్టు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కనీసం వైసిపి ఉనికి లేదు. నేతల జాడలేదు. ముందుగా అక్కడ పని చూడండి అన్నట్టు వైసిపి నేతల సూచన ఉంది. గత రెండేళ్లలో ఆ మూడు నియోజకవర్గాల్లో వైసిపి చేసిన కార్యక్రమం అంటూ లేకపోవడం విశేషం.
వై నాట్ కుప్పం అంటూ సౌండ్ చేశారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంను గెలిచేస్తాం అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు పెద్దదిక్కుగా మారిపోయారు. తన పుంగనూరు విడిచిపెట్టి మరి కుప్పం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క పదవి కూడా వదలకుండా అంతా తీసుకున్నారు. అభివృద్ధి పనులు కూడా పగబట్టి మరీ చేశారు. కానీ కుప్పం ప్రజలు మాత్రం మళ్లీ చంద్రబాబునే పట్టం కట్టారు. ప్రస్తుతం అక్కడ వైసిపి ఇన్చార్జిగా ఉన్న భరత్ జాడలేదు. వైసిపి కార్యక్రమాలు జరగడం లేదు. పట్టించుకునే నాధుడు కూడా అక్కడ లేడు.
ఇక మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ మానియా నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి లోకేష్ వినూత్న తరహాలో ముందుకు వెళ్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా. 2019లో ఓడిపోయిన తర్వాత సొంత ఖర్చుతో అభివృద్ధి చేసి చూపించారు. ఇప్పుడేమో ప్రభుత్వపరంగా చేసి చూపిస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి జాడలేదు. మొన్న పోటీ చేసిన మహిళా నేత కనిపించడం లేదు. పైగా అక్కడ మాజీ మంత్రి ఒకరు లోకేష్ పట్ల అనుకూల ప్రకటనలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు ముద్రగడ పద్మనాభం. అయితే ఓడించలేక తన పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబు సైతం జనసేనలోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన వంగా గీత ఆచూకీ లేదు. కనీసం అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు లేవు. ఈ మూడు చోట్ల ముందు చూడండి.. తరువాత మాట్లాడండి అన్నట్టు ఉంది వైసీపీ నేతల వ్యవహార శైలి.
