Rs 20 Note Prayer Goes Viral: సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు.. దేవుడిని దర్శించుకుంటాం. ఆ తర్వాత హుండీలో కానుకలు వేస్తుంటాం. తాము మొక్కుకున్న మొక్కుల ఆధారంగా కానుకలు వేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు నిలువు దోపిడీ కూడా సమర్పించుకుంటారు. ఇలా భక్తుల మొక్కుల ఆధారంగానే కానుకలు సమర్పిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలోని పంపనూరు ప్రాంతంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం హుండీలో ఇటీవల అర్చకులు లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీలో ఉన్న కానుకలను లెక్కించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అర్చకులకు ఒక 20 రూపాయల నోటు లభించింది. ఆ నోటు మీద ఉన్న రాత చూసి వారికి దిమ్మ తిరిగిపోయింది.
“స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. ఆమె త్వరగా చనిపోయేలా చూడు” అంటూ ఆ నోటు మీద రాసింది.. దీంతో అర్చకులు ఒకసారిగా ముక్కున వేలేసుకున్నారు. దేవుడికి సమర్పించే కానుకల విషయంలో కూడా ఇలా కూడా వ్యవహరిస్తారా అంటూ ఆశ్చర్యపోయారు.. అయితే ఆ అజ్ఞాత భక్తురాలు ఎవరో గాని కొంతకాలంగా ఆమె అత్త చేతిలో వేదింపులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఇలాంటి కోరిక కోరినట్టు అక్కడి అర్చకులు చర్చించుకుంటున్నారు.
ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి చర్చకు దారి తీస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతోంది. ఇటీవల కాలంలో ఈ ఆలయంలో ఇటువంటి విచిత్ర కోరికలు కోరుకుంటూ.. స్వామివారికి కానుకలు సమర్పించేవారు పెరిగిపోయారంటూ అక్కడి అర్చకులు చెబుతున్నారు.. అయితే స్వామి వారిని కోరికలు కోరుతున్నప్పుడు అవి సహజ సిద్ధంగా ఉండాలని.. అంతేతప్ప ఇటువంటి దారుణాలకు సంబంధించినవి ఉండకూడదని అర్చకులు అంటున్నారు. దేవుడు మనిషి బాగు మాత్రమే కోరుతాడని.. చావును ఇష్టపడడని అర్చకులు అంటున్నారు.
ఇక్కడ సుబ్రమణ్య స్వామి ఆలయం చాలా ఫేమస్. అయ్యప్ప స్వామి దీక్షల సమయంలో ఈ ఆలయం మాల ధారులతో సందడిగా ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్టినాడు ఇక్కడ విశేషమైన పూజలు జరుపుతుంటారు. భక్తులకు అన్నదానం.. స్వామివారికి పూజలు జరుపుతూ ఉంటారు.
