Homeఆంధ్రప్రదేశ్‌Indian Chilli Export: మన మిరప అంత డేంజరా.. చైనా ఎందుకు వద్దంటోంది..

Indian Chilli Export: మన మిరప అంత డేంజరా.. చైనా ఎందుకు వద్దంటోంది..

Indian Chilli Export: మనదేశంలో మిరప ఎక్కువగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. ఇక్కడ పండే మిరపకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా టమాటా మిర్చి.. తేజ రకం మిర్చికి ఈ రెండు రాష్ట్రాలు పెట్టింది పేరు. అందువల్లే చైనా వ్యాపారులు మన తెలుగు రాష్ట్రాలలో పండిన మిరపకాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎండు మిరపకాయల నుంచి కారం మాత్రమే కాకుండా.. కృత్రిమ రంగులలో ఉపయోగించే రసాయనాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ రసాయనాలకు చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

సాధారణంగా మిర్చిలో రైతులు ఎక్కువగా క్రిమిసంహారకాలు వాడుతుంటారు. మిరప అనేది అత్యంత సున్నితమైన పంట. ఎక్కువ దిగుబడి సాధించడానికి రైతులు విపరీతంగా క్రిమిసంహారకాలు వాడుతూ ఉంటారు. గతంలో క్రిమిసంహారకాల వాడకం ఒక స్థాయి వరకు ఉండేది. కొంతకాలంగా మిరప మీద తెగుళ్లు విపరీతంగా దాడి చేస్తున్న నేపథ్యంలో దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల రైతులు క్రిమిసంహారకాలను ఎక్కువగా వాడాల్సి వస్తోంది. దేశీయంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. ఎగుమతి అయ్యే మిరప విషయంలోనే కష్టాలు ఎదురవుతున్నాయి.

మన దగ్గర పండిన మిర్చి ఎక్కువగా చైనా దేశానికి ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రెండు కంటైనర్ల మిర్చి మన దేశానికి చైనా తిరిగి పంపింది. దీనికి ప్రధాన కారణం క్రిమిసంహారకాలు అధికంగా ఉండటమే. ఈ స్థాయిలో క్రిమి సంహారకాలు వాడిన మిరపని పంపిస్తే తీసుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. దీంతో మిరప వ్యాపారులు ఆందోళన చెపుతున్నారు. మిరపలో క్రిమిసంహారకాల వాడకాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని.. రైతులు సహజ సిద్ధమైన పద్ధతుల్లో మిరపని పండించే విధంగా చూడాలని వ్యాపారుడు కోరారు. పదేపదే పురుగుమందుల అవశేషాల ఉల్లంఘన జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారత మార్కెట్ విలువ పడిపోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనాకు ఎగుమతి అవుతున్న మిరపలో మెతా మెడోఫాస్.. మొనోక్రోటఫాస్.. ప్రొఫెనోపాస్.. ట్రయాజో పాస్.. ఇతియాన్.. క్లోరోపైరీఫాస్.. పిఫ్రోనిల్ వంటి ఆందోళన కలిగించే క్రిమిసంహారకాలు ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ మిరప వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు.. ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రధానంగా ఈ క్రిమిసంహారకాలను చూపించి ఎగుమతులను తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు.. అంతేకాదు ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని.. రైతులకు మేలైన విత్తనాలు.. పంట దిగుబడిలో తీసుకోవాల్సిన సూచనలు.. తెగుళ్ల బారిన పడకుండా మేలైన దిగుబడి అందించే వంగడాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

రైతులకు పురుగుమందులు అమ్మే డీలర్ల మీద కఠినమైన పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.. గుంటూరు.. పల్నాడు.. ప్రకాశం.. కర్నూలు.. నంద్యాల.. తెలంగాణ.. కర్ణాటక వంటి రాష్ట్రాలలో మిరప పండించే రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మిరప వ్యాపారులు చెబుతున్నారు. సక్రమంగా ఎగుమతులు చేయని పక్షంలో దేశీయంగా రేటు పడిపోతుందని.. అది రైతులకే నష్టం చేకూరుతుందని వ్యాపారులు చెబుతున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version