YSR Congress Seniors: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ ద్వారా రాజకీయ పదవులు దక్కించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఆ పార్టీలో మంత్రులుగా దాదాపు 40 మంది వ్యవహరించారు. 151 మంది వరకు ఎమ్మెల్యేలు అయ్యారు. 40 మంది వరకు ఎమ్మెల్సీ పదవులు అనుభవించారు. దాదాపు 40 మంది వరకు ఎంపీలు అయ్యారు. ఇంతమంది ఆ పార్టీలో ఉండగా ఒకరిద్దరు మాత్రమే ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీలో జరిగే పరిణామాలపై మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయగలుగుతున్నారు. మిగతావారు ఎందుకు మాట్లాడడం లేదు అంటే.. పార్టీపై అసంతృప్తి, అధినేత ధోరణి పై అసంతృప్తి వంటి కారణాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. పార్టీ నేతలపై దాడులు జరుగుతున్న వారు నోరు తెరవకపోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
* కనీసం స్పందించే వారేరీ?
మాజీ మంత్రులు అంబటి రాంబాబు( ambati Rambabu), జోగి రమేష్ ఇళ్ల పై దాడులు జరిగాయి. ఏకంగా పెట్రోల్ బాంబుల దాడులు జరిగాయి. అయితే ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ ఇద్దరు నేతల వైఖరి. విపరీతమైన అహంభావ ధోరణి, అనుచిత వ్యాఖ్యలతో ఈ ఇద్దరు నేతలు నిత్యం వివాదాస్పదంగానే ఉండేవారు. అయితే వీరి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డికి కానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎంత మైలేజ్ వచ్చిందో చెప్పలేం కానీ.. ప్రత్యర్థుల పట్ల వీరు చేసే వ్యాఖ్యలు లాభం కంటే నష్టం చేకూర్చాయి. ఇటువంటి వారికి నాయకత్వం ప్రోత్సాహం ఉండడంతో మిగతా నేతల్లో ఒక రకమైన ఆవేదన ఉంది. అందుకే వైసీపీలో సీనియర్లు మౌనంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
* మాట్లాడింది ఒక్కరే..
ఈ ఘటనపై సీనియర్లలో ఒకే ఒక్కరు మాట్లాడారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ( Satyanarayana ) ప్రశ్నించారు. మరో సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొడి పొడిగా మాట్లాడారు. మిగతా వారంతా ఎప్పుడూ మాట్లాడిన వారే. అయితే సీనియర్లు ఎందుకు నోరు మెదపడం లేదనేది వైసీపీలో టాక్. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ నాయకత్వం అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. 2014 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. 2019లో అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఒకసారి వైసీపీ ప్రతిపక్షపాత్రను చూశారు. మరోసారి అధికార హోదాను కళ్ళారా చూశారు. అయితే అవే పరిస్థితులు, అంతే బలము ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది కానీ.. ప్రజలు తమ నుంచి ఆశిస్తున్న పాత్రను పోషించడం లేదు. సీనియర్లకు సైతం సరైన గౌరవం లేదు. వారి అభిప్రాయానికి విలువలేదు. అందుకే వారంతా మౌనంగా ఉంటున్నారు.