Vizianagaram Politics: విజయనగరం అంటే ముందుగా గుర్తొచ్చేది రాజకుటుంబం. విజయనగరం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆస్తులన్నీ పూసపాటి రాజ కుటుంబానిదే. అందుకే అక్కడ పూసపాటి కుటుంబం రాజకీయాల్లో రాణించింది. తమ కోసం రాజులు యావదాస్తిని విడిచిపెట్టడం అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. పార్టీ ఏదైనా.. విజయనగరంలో మాత్రం రాజులకు అక్కడి ప్రజలు పట్టం కడుతూ ఉంటారు. అటువంటి రాజకుటుంబ హవాకు బ్రేక్ వేసింది మాత్రం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కోలగట్ల.. వచ్చే ఎన్నికల నాటికి తన కుమార్తె శ్రావణిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఒకసారి అశోక్ గజపతి రాజును.. ఇంకోసారి ఆయన కుమార్తె అదితి గజపతిరాజును ఓడించారు వీరభద్ర స్వామి. ఇప్పుడు అశోక్ గజపతిరాజు కుమార్తెతో కోలగట్ల కుమార్తె శ్రావణి తలపడనున్నారు.
* గోవా గవర్నర్ గా..
పూసపాటి అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన చేయని పదవి అంటూ లేదు. రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. మొన్ననే ఆయనకు గోవా గవర్నర్గా అవకాశం వచ్చింది. తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజును రంగంలోకి దించారు. ఆమె ఎమ్మెల్యే అయ్యారు. 197 8 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న అశోక్.. 2004లో మాత్రం కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడిపోయారు. 2009లో అదే వీరభద్ర స్వామిని ఓడించారు. 2014లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. 2019లో ఎంపీగా పోటీ చేసిన అశోక్, ఎమ్మెల్యేగా పోటీచేసిన కుమార్తె ఓడిపోయారు. ఆమెపై కోలగట్ల గెలిచి రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికయ్యారు.
* శ్రావణి సిద్ధం..
అయితే ఇప్పుడు కోలగట్ల కుమార్తె శ్రావణి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఆమెకు విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల్లోకి కూడా బలంగా వెళ్తున్నారు. అదితి గజపతిరాజును ఢీకొట్టగల సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే విజయనగరం పరిధిలో తూర్పు కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఈసారి అక్కడ బీసీ నినాదం వినిపిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తెకు టిడిపి టికెట్, కోలగట్ల కుమార్తెకు వైసిపి టికెట్ లభించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
