Vijayasai Reddy Re Entry: వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు మీడియా రంగంలో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జూన్లో కానీ జూలైలో కానీ రాజకీయ ప్రకటన ఉంటుందని ఆయన చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారన్న కొత్త ప్రచారం జరుగుతోంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య ప్రతిపక్ష పాత్ర పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి మించి అన్నట్టు అప్పట్లో దూకుడుగా ఉండేవారు విజయసాయిరెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే పార్టీకి ఒక ఊపు తెచ్చింది విజయసాయిరెడ్డి అనేది ఆ పార్టీ శ్రేణుల మాట. అటువంటి నేత అవసరం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అందుకే త్వరలో విజయసాయిరెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం తెగ నడుస్తోంది. ఒకవైపు ఈడి తనిఖీలు జరుగుతుండగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. సాక్షాత్ ముఖ్యమంత్రి పైనే ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు అంటే విజయసాయిరెడ్డి ఎంతలా దూకుడుగా ఉంటారో అర్థం అవుతుంది.
క్షేత్రస్థాయిలో బాగాలేదు..
మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పెద్ద తలకాయలు పెద్దగా పనిచేయడం లేదు. వారి వ్యూహాలు కూడా పనిచేయడం లేదు. అందుకే విజయసాయిరెడ్డి అవసరాన్ని జగన్ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డిని మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. పైగా విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే అటువంటి ప్రయత్నాలను ఆదిలోనే తుంచేయాలి అంటే… కచ్చితంగా వైసీపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇప్పించాల్సిందేనన్న డిమాండ్ పెరుగుతోంది జగన్మోహన్ రెడ్డి పై. అందుకే జగన్ సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నా..
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దూకుడుగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. పార్టీ అనుబంధ విభాగాల ఏర్పాటుతో పాటు సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేశారు. ఐప్యాక్ టీం కంటే చురుగ్గా పనిచేశారు విజయసాయిరెడ్డి.. అలా ఆ ప్రయత్నాలు ఫలించాయి. 67 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. 2019లో బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలుపు వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారు. మరోసారి ఆ పరిస్థితి కోసమే ఇప్పుడు విజయసాయిరెడ్డిని వైసీపీలోకి రప్పించుకుంటారని తెలుస్తోంది. అయితే వైసీపీ రాజ్యసభ వదులుకున్నారు. అపై మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారం విజయసాయిరెడ్డి ఇచ్చారు. పైగా వైసిపి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటువంటి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీలోకి తెప్పించుకుంటారా అనేది కూడా ఒక అనుమానమే.