Vijayasai Reddy new business: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డికి( Vijaya Sai Reddy) వ్యవసాయం అంతగాగిట్టుబాటు అయినట్టు లేదు. అందుకే ఇప్పుడు మీడియా వ్యాపారంలో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట విజయ్ సాయి రెడ్డి. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు. అయితే మీడియాను ఏర్పాటు చేస్తానని ఇదివరకే చెప్పుకొచ్చారు విజయ సాయి రెడ్డి. కానీ ఆ పని చేయలేదు. అయితే ఇప్పుడు డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా.. కేవలం ప్రజల పక్షాన నిలబడి.. వాస్తవాలను వెలికి తీస్తామని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా సామాన్యులు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేయడమే ముఖ్య ఉద్దేశం గా పేర్కొన్నారు.
వైసీపీలో ఉన్నప్పుడే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో ఉన్నప్పుడే మీడియాను ప్రారంభిస్తానని పలు సందర్భాల్లో చెప్పారు విజయసాయిరెడ్డి. అప్పట్లో రామోజీరావు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడులను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాస్కోండి తన మీడియా సైతం వస్తుందని హెచ్చరికలు పంపారు. తరువాత వైసిపి నుంచి బయటకు వెళ్లినప్పుడు కూడా మీడియాను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కానీ ఎప్పటికప్పుడు తాత్సారం జరుగుతూ వచ్చింది. కానీ ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా డిజిటల్ మీడియాలోకి అడుగు పెడతానని చెబుతున్నారు. అది విజయవంతం అయిన తర్వాత పూర్తిస్థాయి తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ ను లాంచ్ చేయాలనేది తన విజన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరలేకపోయారు. రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తన విషయంలో జగన్ వేరే ఆలోచన చేయరు. అందుకే మీడియాను ఏర్పాటు చేసుకొని బలమైన వ్యవస్థను తీసుకురావాలని ఆయన చూస్తున్నారు.
రకరకాల వార్తలు..
మొన్న ఆ మధ్యన తన మీడియా ఏర్పాటు విషయంలో చాలా రకాల వార్తలు వచ్చాయి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఒకరు ఆయన మీడియా బాధ్యతలు చూస్తారని బయట ప్రచారం జరిగింది. బలమైన మీడియాలో సీఈఓ గా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి కంపెనీలో చేరబోతున్నట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఎప్పటికప్పుడు జాప్యం జరుగుతూ వస్తున్న ఈ ప్రక్రియ.. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రకటనతో వాస్తవం అని తేలింది. త్వరలో డిజిటల్ మీడియాకు సంబంధించిన నియామకాలు, కార్యాలయాల నిర్వహణ కూడా ప్రారంభం కానుంది. మీడియా ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ఎలానూ ఉంటుంది. మీడియా అన్నది నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ముందుగా డిజిటల్ మీడియాలో అడుగుపెట్టి.. క్రమేపీ మెయిన్ మీడియా వైపు అడుగులు వేయాలన్నది విజయసాయిరెడ్డి ప్రణాళిక. అయితే ఇప్పుడు కొత్తగా మీడియా వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. కానీ ఆ సాహసం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.