Vijayasai Reddy: ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఒకవైపు విచారణ చేపడుతుండగా.. సమాంతరంగా ఈడి కూడా దర్యాప్తు చేస్తోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ మాజీ నేత విజయసాయిరెడ్డిని పిలిచి మరి విచారణ చేసింది ఈడి. ఏకంగా ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది. విజయసాయిరెడ్డిని ఈడి విచారణ చేపట్టడం ఇది మూడోసారి. అయితే ఈసారి విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ చుట్టూ విచారణ కొనసాగినట్లు సమాచారం. గతసారి ఈడి తనిఖీల సమయంలో విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ ను ఈడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డి ఎదుట ఆ సెల్ ఫోన్ లో ఉన్న వివరాలను ఫోరెన్సిక్ నిపుణులు క్లోనింగ్ చేపట్టారు. ల్యాబ్ నివేదిక వచ్చిన వెంటనే మరోసారి విజయసాయిరెడ్డిని విచారించే అవకాశం ఉంది.
* ఏడు గంటల పాటు విచారణ..
దాదాపు 7 గంటల పాటు ఈడి ఎదుట ఉండిపోయారు విజయసాయిరెడ్డి. హైదరాబాదులోని ఈడీ కార్యాలయం వద్ద ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు అనంతరం మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి అసలు తనను విచారణ చేపట్టలేదని.. తన సమక్షంలో ఫోన్లో ఉన్న వివరాలను తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ల్యాబ్ నివేదిక వచ్చిన వెంటనే మరోసారి సమన్లు జారీ చేసి తనను పిలిచే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి స్వయంగా పేర్కొనడం విశేషం. అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని.. మొత్తం వ్యవహారం నడిపింది రాజ్ కసిరెడ్డి అని.. ఈ విషయం ఎన్నిసార్లు అడిగినా చెబుతానని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి.
* ఫోన్ లోనే చిట్టా అంతా..
అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోన్ కీలకంగా మారింది. ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి ద్వారా జరిగిన లావాదేవీల లోగుట్టులు బయటపడే అవకాశం ఉంది. మద్యం కంపెనీల విషయంలో తాను మధ్యవర్తిత్వం వహించానని.. ఇప్పటికే పలుమార్లు హింట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఏకంగా ఆయన సెల్ఫోన్ దొరకడంతో ఈడి అధికారులు డొంక మొత్తం కదిలించనున్నారు. విజయసాయిరెడ్డి నేరుగా చెప్పడం కంటే తన సెల్ ఫోన్ ద్వారా మొత్తం గుట్టు రట్టు చేశారు అనడం వాస్తవం. వైసిపి హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ పై ఉన్నారు. అంటే మద్యం కుంభకోణంలో ఆయన అప్రూవర్ గా మారారు అన్నమాట. కానీ తనకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని.. తాను అప్రూవర్ గా మారలేదని చాలాసార్లు చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ తన సెల్ ఫోన్ చుట్టూ విచారణ కొనసాగుతోందని.. మరోసారి ఇది తనను పిలిచే అవకాశం ఉందని స్వయంగా విజయసాయిరెడ్డి ధ్రువీకరించడం విశేషం.
