Vijayasai Reddy: రాజకీయాల్లో కొంతమంది వింత ప్రవర్తనతో ముందుకు వెళుతుంటారు. వారి అంతిమ లక్ష్యం ఒకటి ఉంటుంది. వారి మనసులో ఒకటి ఉంటుంది. బయటకు మాత్రం మరో మాట చెబుతుంటారు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూనే ఆయన అభిప్రాయంతో ఏకీభవించినంత పని చేస్తున్నారు. ఆయన కోరిన విధంగానే సరికొత్త డిమాండ్ తో ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాజాగా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టు అని తేల్చేశారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించారు విజయసాయిరెడ్డి. మావిగన్ పై చిన్న పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే.. అమరావతి పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు.
* అమరావతి పై అదే విషం
అమరావతి పై మరోసారి విషం కక్కారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర విభజన జరిగి 15 ఏళ్లు అవుతున్న ఇంకా రాజధానిపై రగడ ఎందుకు అంటూ పెద్దన్న మాటలు అన్నారు. అంతటితో ఆగకుండా మావిగన్ జగన్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ.. విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి అనే వి జి టి యం కాన్సెప్ట్ విభజన చట్టంలోనే ఉందని.. శివరామకృష్ణ కమిషన్ ఇదే చెప్పిందని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం – విజయవాడ- గుంటూరును కలుపుతూ మావిగన్ అని చెబితే.. వాటికి అదనంగా మంగళగిరిని చేర్చి గొప్ప సలహా ఇచ్చేసారు విజయసాయిరెడ్డి.
* అప్పుడు మాట్లాడకుండా..
విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. అమరావతి ఏకాభిప్రాయంతో నిర్ణయించినప్పుడు కూడా అదే వైసీపీలో.. అదే స్థానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు. కానీ ఎన్నడు రాజధానుల విషయంలో సలహా ఇవ్వలేదు. తప్పు పట్టే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మాత్రం తన మేధావితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దానిపై కోర్టుకు ఆశ్రయిస్తానని కూడా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెబితే.. దానికి మంగళగిరి చేర్చి.. నగరాలను విస్తరించాలని సూచిస్తున్నారు. అదే ఆటోమేటిక్గా రాజధాని అయిపోతుందని విలువైన సలహా ఇచ్చేస్తున్నారు ఈ మేధావి విజయసాయిరెడ్డి.

