Vangaveeti Mohan Ranga: ఏపీ ( Andhra Pradesh) రాజకీయ చరిత్రలో అత్యంత భావోద్వేగాలు, వివాదాలు, పోరాటాలతో ముడిపడిన పేరు వంగవీటి మోహన రంగా. కాపు ఉద్యమానికి ప్రత్యేకగా నిలిచిన ఈ నేత దారుణ హత్యకు గురయ్యారు. కేవలం రాజకీయ కోణంలోనే ఆయన హత్య జరిగింది అని చెప్పలేం. ఎందుకంటే ఆయన హత్యకు గురైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో టిడిపి మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టిడిపి పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమైన వంగవీటి మోహన్ రంగా హత్యపై విచారణ చేపట్టిందా? అంటే అది లేదు. అలా రంగా హత్యపై ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప.. ఏ ప్రభుత్వంలో కూడా కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారి వంగవీటి మోహన్ రంగా పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు లేవు కానీ మోహన్ రంగా హత్యను మరోసారి ప్రస్తావించారు మంత్రి నిమ్మల రామానాయుడు. దీంతో ఏపీ రాజకీయాలు మోహన్ రంగా హత్యపై వెళ్ళాయి.
* రూ.1000 కోట్ల లాభం చూపించారని..
వంగవీటి మోహన్ రంగ ను( vangaveeti Mohan Ranga) హత్య చేసిన నేత కుమారుడికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు లాభం చూపించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపుల ద్వారా రాజకీయం చేయదలుచుకుంటుంది అని చెప్పే క్రమంలో వంగవీటి మోహన్ రంగ హత్యను ప్రస్తావించారు నిమ్మల రామానాయుడు. అయితే ఈ ఆరోపణలు దేవినేని అవినాష్ పై చేశారు. రంగా హత్యలో ప్రధానంగా ఆరోపణలు వచ్చింది దేవినేని నెహ్రూ పై. రంగా హత్యకు గురైనప్పుడు నెహ్రూతో రాజకీయ విభేదాలు ఉండేవి. ఆయన టిడిపి ప్రభుత్వంతో చేతులు కలిపి హత్య చేయించారన్నది ప్రధాన ఆరోపణ. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రంగా హత్య కేసును తేల్చలేకపోయింది.
* పరస్పరం పార్టీలను మార్చుతూ..
అయితే రంగా హత్య కేసును ఒక ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో భాగంగానే ఈ హత్య జరిగింది అనేది వాస్తవం. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అన్ని పార్టీలు ఆశ్రయము ఇచ్చాయి. బాధిత వంగవీటి కుటుంబం సైతం పార్టీలను మార్చుతూ వచ్చింది. రంగా హత్య జరిగిన వెంటనే ఆ కుటుంబం టిడిపి పై విరుచుకుపడింది. ఇప్పుడు అదే కుటుంబం టిడిపి పంచన చేరింది. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని కుటుంబం సైతం కాంగ్రెస్ నుండి టిడిపిలోకి వచ్చింది. టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం నెహ్రూ కుమారుడు అవినాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే సమయంలో మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ టిడిపిలో ఉన్నారు. వైసీపీలో ఉన్న కొడాలి నానితోపాటు వల్లభనేని వంశీ లాంటి వారు రాధాకృష్ణకు స్నేహితులు. ఇలా రాజకీయ సంబంధాల ముసుగులో.. వంగవీటి మోహన్ రంగ హత్య కూడా రాజకీయంలానే మారిపోయింది. అయితే ఇప్పుడు కాపుల ద్వారా రాజకీయం చేయాలనుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పేందుకే.. నిమ్మల రామానాయుడు లాంటి మృదుస్వభావి కూడా రంగా హత్య కేసును తెరపైకి తెచ్చారు.