RK Roja Arrest News: మరో మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోందా? ముహూర్తం ఫిక్స్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని, నందిగాం సురేష్, పేర్ని నాని, జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఇలా కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. అందులో చాలామంది అరెస్టయ్యారు కూడా. అయితే ఇప్పుడు ఆ జాబితాలో చేరారు మాజీ మంత్రి ఆర్కే రోజా( RK Roja ). ఆమెను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. తెరవెనుక ఆమె అరెస్టుపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో ఆమె అరెస్టు ఎప్పుడు అన్నదానిపై.. శాప్ చైర్మన్ స్పష్టతనిచ్చారు.
క్రీడల నిర్వహణలో దుబారా
జగన్(YS Jagan Mohan Reddy) మంత్రివర్గంలో ఆర్కే రోజా రెండున్నరేళ్లుగా పనిచేశారు. పర్యాటకశాఖ తో పాటు క్రీడల మంత్రిగా ఉండేవారు. 2024 ఎన్నికల కు ముందు ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ పోటీల నిర్వహణకు సంబంధించి భారీగా అవినీతి జరిగిందని ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత శాఖామంత్రిగా రోజా, ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ వంటి వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. భారీగా నిధులు దుర్వినియోగంతో పాటు నాసిరకం క్రీడా సామాగ్రి అందించి.. ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించాలని వారిపై ఫిర్యాదులు వచ్చాయి. సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాలు, ఆట్యా పాట్యా ప్రతినిధులు ఫిర్యాదులు రావడంతో 13 ఉమ్మడి జిల్లాల్లో విచారణ కూడా జరిగింది. నాడు క్రీడల నిర్వహణకు సంబంధించి ఖర్చుపెట్టిన నిధులు, పక్కదారి పట్టించిన అంశాలకు సంబంధించి వివరాలను సేకరించారు. ఈ దర్యాప్తునకు సంబంధించి తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది.
ఇప్పటికీ అదే దూకుడు
అయితే మాజీ మంత్రి రోజా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమెపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే తొలుత మహిళ కావడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఇదే అదునుగా రోజా చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నట్టు మూడు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రోజాను విడిచి పెట్టవద్దని.. తప్పకుండా అరెస్టు చేసి తీరాలని కోరుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆమె అరెస్టుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
శాప్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..
చిత్తూరు జిల్లాకు చెందిన రవి నాయుడు(Ravi Naidu ) శాప్ చైర్మన్ గా ఉన్నారు. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా. మాజీ మంత్రి రోజా అవినీతిపై ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆగస్టు పదిలోగా రోజా అరెస్టు తప్పదని ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అరెస్ట్ కాబోయే మాజీ మంత్రుల జాబితాలో రోజా కూడా చేరిపోయారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.