Thalliki Vandanam Scheme: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ప్రస్తుతం విద్యార్థుల వివరాలతో కూడిన సమాచారం సచివాలయాలకు చేరుతుంది. వారు పరిశీలన చేసి ఓకే చేశాక తల్లుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు తల్లికి వందనం నిధులు కూడా జమ చేసేందుకు సన్నాహాలు చేయడం శుభపరిణామం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* అప్పట్లో అమ్మ ఒడి పేరుతో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమ్మ ఒడి పేరిట ఈ పథకం అమలు చేసేవారు. కూటమి ప్రభుత్వం దానిని తల్లికి వందనం పథకం గా మార్చింది. గత విద్యా సంవత్సరంలో 78 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి నగదు సాయం చేసింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అలా కాదు. ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే అప్పట్లో వర్తించేది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఏడాది ఒక్కో ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్న అందించి అనుకున్నది అమలు చేశారు చంద్రబాబు. ఈ ఏడాది కూడా అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మూడు వారాల ముందే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభం అయింది. సచివాలయాల వారీగా జాబితాలు చేరాయి. సచివాలయ ఉద్యోగులు పరిశీలనలు చేస్తున్నారు.
* జూన్ 12న విడుదల..
వేసవి సెలవుల అనంతరం జూన్ 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆ సమయానికి జాబితాల పరిశీలనతో పాటు అర్హుల జాబితాను సచివాలయాల వారీగా ప్రదర్శించనున్నారు. అర్హులకు మాత్రమే అందిస్తారు. తల్లిదండ్రులకు సంబంధించి మాగాణి మూడు ఎకరాలు లోపు, మెట్టు పది ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఆదాయపు పన్ను చెల్లించకూడదు. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి ప్రతి నెల. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదు. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి తల్లికి వందనం రాకుంటే.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రక్రియ ప్రారంభమైన దృష్ట్యా జూన్ 12న కానీ.. జూన్ 19న కానీ తల్లికి వందనం నిధులు జమ చేసే అవకాశం ఉంది.