Thalliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం పై స్పష్టత వచ్చింది. లక్షలాదిమంది విద్యార్థులు చదువు సాయం కోసం ఎదురుచూస్తుండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్న నేపథ్యంలో.. దీనిపై స్పష్టతనిచ్చారు. ఈనెల లోనే తల్లికి వందనం సాయం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే అంతర్గతంగా విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 16 నుంచి మూడు రోజుల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ మ్యాపింగ్ సర్వే పూర్తి కావడంతో.. జాబితాలను సచివాలయాల వారిగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
* ఎంతమంది పిల్లలు ఉన్నా..
పిల్లల చదువు కోసం ఏటా తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈ పథకానికి దరఖాస్తులను పాఠశాలల ద్వారా ఆహ్వానించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రభుత్వం పంపింది. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఈ నిధులను అందుకునేందుకు అర్హులైన తల్లులను గుర్తించారు. త్వరలో సచివాలయాల వారీగా జాబితాలను ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆలస్యంగా అందాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు కూడా అందుబాటులోకి రాలేదు తగినంతగా. దానికి కారణం పశ్చిమ ఆసియాలో యుద్ధం. ఆ కిట్లకు సంబంధించి ముడి సరుకులు రాకపోవడంతో.. ఇబ్బందులు ఎదురయ్యాయి.
* జూలై మూడో వారంలో..
వేసవి సెలవులు అనంతరం.. గత నెల 12న పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు జూలై మొదటి వారం దాటుతోంది. తల్లికి వందనం నిధులు విడుదల కాకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెట్టి తల్లికి వందనం నిధులు జమ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈనెల మూడో వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు మంత్రి లోకేష్. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం పలికి వందనం నిధుల విడుదలపై స్పష్టతనిచ్చారు. అన్నీ కుదిరితే ఈ నెల 16 నుంచి 18 లోపు తల్లికి వందనం నిధులు జమ కావడం ఖాయం. అయితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తప్పిదాలు సరిచేసుకునే అవకాశం కూడా ఇవ్వనున్నారు. అర్హత ఉండే వివిధ కారణాలతో సాయం దక్కని వారికి.. మరోసారి గ్రీవెన్స్ కు వెళ్లే ఛాన్స్ ఇవ్వనున్నారు. ముందుగా సచివాలయాల వారీగా అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తారు.

