Indian Student Death America Job Crisis: అతడి పేరు చందు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగరంలో జన్మించాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చెందుకు మొదటి నుంచి కూడా జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలని కోరిక. భారీగా సంపాదించి.. మంచి పేరు తెచ్చుకోవాలని.. అనుకుంటుండేవాడు.. ఇందులో భాగం గానే కష్టపడి చదివాడు. సగటు తెలుగు కుర్రాళ్ల మాదిరిగానే తను కూడా అమెరికా వెళ్లి.. తన ఆశయాలను సాధించుకోవాలని అనుకున్నాడు. కానీ అతడు అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.
కర్నూలు నగరానికి చెందిన చందు మాస్టర్స్ పూర్తి చేయడానికి అమెరికా వెళ్ళాడు. అమెరికాలోని చికాగో డిఫాల్ విశ్వవిద్యాలయంలో అతడు తన ఉన్నత విద్యను పూర్తి చేశాడు. కాలేజీలో చదువుకుంటూ ఉండగానే పార్ట్ టైం ఉద్యోగాలు చేశాడు. తన చదువుకు సంబంధించిన ఖర్చులను కొంతమేర పార్ట్ టైం జాబ్ ద్వారా సంపాదించుకున్నాడు. మాస్టర్స్ చేయడానికి కొంతమేర డబ్బు రుణం ద్వారా సేకరించాడు. మాస్టర్స్ పూర్తయిన తర్వాత జాబ్ సంపాదించి, తెచ్చిన రుణాలను తీరుద్దామని అనుకున్నాడు. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది. దీంతో చందు జీవితం తలకిందులుగా మారిపోయింది. ఎన్నో ఆశలతో అమెరికాలోకి అడుగుపెట్టిన అతడికి.. ఏ అవకాశం తలుపు తట్టలేదు. ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసినప్పటికీ.. అతడికి ఫుల్ టైం జాబ్ దొరకలేదు.
ఫుల్ టైం జాబ్ కోసం చందు అనేక ప్రయత్నాలు చేశాడు. చాలా కంపెనీలకు తన రెస్యూమ్ లు పంపాడు. అనేక ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాడు. ఉద్యోగం కోసం అతడు వెళ్లని కార్యాలయం లేదు. కలవని మనిషి లేడు. ఇంత చేసినప్పటికీ అతనికి ఉద్యోగం లభించకపోవడంతో నిరాశ అలముకుంది. ఏం చేయాలో తెలియక.. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చందు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి అక్కడి తెలుగు సంఘాలు.. అతడు స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికాలో కొంతకాలంగా జాబ్ మార్కెట్ మొత్తం నేల చూపులు చూస్తోంది. ముఖ్యంగా ట్రంపు అధ్యక్షతన తర్వాత భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు లభించడం కష్టం గా మారింది. అన్ని విధానాలను ట్రంప్ కఠిన తరం చేశారు. కంపెనీలపై ఒత్తిడి పెంచారు. దీంతో భారతీయులకు ఉద్యోగాలు లభించడం కష్టం గా మారింది. ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు లభించక.. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేక.. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఒత్తిడిని చాలామంది ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో చందు కూడా ఒకడు. కాకపోతే చందు కష్టాలను ఎదుర్కొనే మనోధైర్యం లేక బలవంతంగా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఎన్నో ఆశలతో అమెరికా గడ్డమీద అడుగుపెట్టిన అతడు చివరికి.. తన ఆశయాలను సాధించలేక విగత జీవిగా మారిపోయాడు.