Bodhan Shakeel Son Raheel Case: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ మాట నిజమైతే బాగుండు అనిపిస్తుంది. సినిమాలలో పోలీసులు అక్రమాలు చేసిన వారిని.. అన్యాయాలు చేసిన వారిని తొక్కిపడేస్తుంటారు. జైలు కూడు తినిపిస్తూ.. చుక్కలు చూపిస్తుంటారు. కానీ, నిజ జీవితంలో అలా ఉండదు. పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిడికి తల వంచుతారు. రాజకీయ నేపథ్యం ఉన్న వారు నేరాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు.
ఇక్కడ పోలీసులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం అధికంగా ఉంటుంది. వారి ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవస్థలను మార్చుతూ ఉంటారు. అటువంటివారిపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులు వెనుకడుగు వేస్తారు. కానీ అప్పుడప్పుడు పోలీసులు ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేస్తారు. అప్పుడు సినిమాలకు మించిన హైప్ వస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా అదే విధమైన హైప్ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడి విషయంలో క్రియేట్ చేశారు. అది కాస్త తెలంగాణలో సంచలనంగా మారింది.
బోధన్ నియోజకవర్గంలో షకీల్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచారు. సిఎంఆర్ బియ్యం కుంభకోణంలో ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. వందల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. షకీల్ దోచుకున్న బియ్యాన్ని.. అక్రమంగా మళ్లించిన డబ్బుల వ్యవహారాన్ని లాగేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే షకీల్ మీద తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు విచారణలో ఉన్నాయి. ఇది జరుగుతుండగానే షకీల్ కుమారుడు రాహీల్ దారుణానికి పాల్పడ్డాడు.
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం మార్చి 17న జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ కేసులో రాహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కొంతకాలం అతడు దుబాయ్ లో ఉంటున్నాడు. హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్ వచ్చాడు. జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.. అయితే ఏప్రిల్ 30న మళ్ళీ దుబాయ్ వెళ్లడానికి అతడు రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు అతడిని వద్దని వారించారు. విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతడు దుబాయ్ వెళ్ళకూడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతులు ఉంటేనే అతడు దుబాయ్ వెళ్లాలని సూచించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కుమారుడికి బ్రేకులు పడ్డాయి.
మన వ్యవస్థలో పోలీసులు సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ ఉదంతం నిరూపిస్తోంది. కన్ను నిన్ను కాకుండా డ్రైవింగ్ చేసి.. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే కుమారుడికి కఠినంగా శిక్ష పడాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించారు. త్వరలోనే వీటిని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.