TDP Mahanadu: ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం వార్షిక జాతర మహానాడు వేడుకగా కొనసాగుతోంది. గతంలో ఏదో ఒక జిల్లాకు, నగరానికి పరిమితమైన మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతతో ముందుకెళ్తోంది టిడిపి. అయితే ప్రాంతీయ పార్టీలకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తోంది తెలుగుదేశం. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు పాటు ఒక ప్రాంతీయ పార్టీ కొనసాగడం అంత సులువైన పని కాదు. కానీ ఆ పని చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎన్నెన్నో పార్టీలకు మార్గదర్శిగా నిలిచింది. అయితే ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో నిలబడడానికి ప్రధాన కారణం నాయకత్వం ఒకటైతే.. అంతకుమించి క్యాడర్ కూడా. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన కేడర్ తో పాటు సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారు. వారే తెలుగుదేశం పార్టీని ఇన్ని రోజులపాటు కాపాడుకుంటూ వస్తున్నారు.
* పడి లేచిన కెరటం..
తెలుగుదేశం పార్టీ పడి లేచిన కెరటం. పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి విజయాలు కొత్త కాదు. అపజయాలు అంతకంటే కొత్త కాదు. కానీ ఎప్పటికప్పుడు నూతన పోకడలతో ముందుకు వెళుతూ ఉంటుంది తెలుగుదేశం. అయితే దానికి ఆక్సిజన్ నింపేది మాత్రం ముమ్మాటికీ మహానాడు. కేవలం తీర్మానాలు రూపొందించే కేంద్రం మాత్రమే కాదు. పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసే ఒక బలమైన వేదిక కూడా. ఆ పార్టీ ఓడిపోయిన ఇప్పుడు నిర్వహించే మహానాడు గెలుపునకు బాటలు వేస్తుంది. గెలిచిన సమయంలో మాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక సూచనలు చేస్తుంది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా మహానాడు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీకి గొప్ప పరిపూర్ణమైన వేదిక.
* అందరి మధ్య వారధి..
పార్టీ అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒక వారధిలా కలిపేది మహానాడు. అయితే కాలానుగుణంగా మహానాడు నిర్వహణ మారినా.. ఆ వేదిక ఆశయం మాత్రం ఒక్కటే. పార్టీ ఆశయాలతో పాటు ఆకాంక్షలు చివరి కార్యకర్త వరకు వెళ్లడం.. పార్టీ హై కమాండ్ అభిప్రాయం.. పార్టీకి దిశా నిర్దేశం.. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా ముందుకు వెళ్లడం.. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం.. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయడం అనే అంశాల చుట్టూ మహానాడు వేదిక ఉంటుంది. నాలుగున్నర దశాబ్దాల టిడిపి చరిత్రలో మహానాడు అనేది ఒక కీలక ఘట్టం. అయితే ఈసారి కొత్త పుంతలు తొక్కుకుంటూ హైబ్రిడ్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
