Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada West Constituency: విజయవాడ పశ్చిమ రూటే వేరు!

Vijayawada West Constituency: విజయవాడ పశ్చిమ రూటే వేరు!

Vijayawada West Constituency: బిజెపి సీనియర్ నాయకుడు సుజనా చౌదరి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా బిజెపికి ఆ స్థానాన్ని కేటాయించారు. టిడిపి తో పాటు జనసేన నుంచి చాలామంది నాయకులు ఆశావహులుగా ఉండేవారు. ముఖ్యంగా జనసేన నుంచి పోతిన మహేష్ గత ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా బిజెపికి కేటాయించారు. సుజనా చౌదరి బరిలో దిగడంతో టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. బలమైన అభ్యర్థి కావడంతో జనసేన కూడా పట్టుబట్టలేదు. అయితే ఈ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెలుపోటములపై భారీ విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

జగన్ వ్యూహాత్మకంగా ఒక సాధారణ అభ్యర్థిని ప్రకటించారు. షేక్ అసిఫ్ అనే ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ప్రాతినిధ్యం వహించేవారు. గత రెండు ఎన్నికల్లోను ఆయన వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గం పై పట్టు సాధించారు. కానీ జగన్ ఆయనను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ టిక్కెట్ ఆశించారు. జనసేన తరఫున పోతిన మహేష్ గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరంతా తెరమరుగయ్యారు. కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి, వైసీపీ అభ్యర్థిగా షేక్ అసిఫ్ ఖరారయ్యారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది.

విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న పశ్చిమ నియోజకవర్గం 1967 లో ఏర్పడింది. విజయవాడ పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ప్రాంతం. సాధారణంగా విజయవాడ అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తారు. కానీ విజయవాడ సిటీలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువే. పొత్తులో భాగంగా ఈ సీటును ఎప్పుడూ మిత్రపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. టిడిపి ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. పొత్తులో భాగంగా 1985లో టిడిపి వామపక్షాలకు ఆస్థానాన్ని కేటాయించింది. ఆ ఎన్నికల్లో గెలిచింది. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ ఆ స్థానంలో గెలిచిన దాఖలాలు లేవు. మిత్ర పక్షాలు మాత్రం గెలుస్తూ వచ్చాయి. ఈసారి మిత్రపక్షాలకు ఈ స్థానాన్ని టిడిపి కేటాయించింది. బిజెపి అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.

ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు అధికం.అందుకే జగన్ వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థిని బరిలో దించారు. ముస్లిం ఓటర్లు 40 వేలకు పైగా ఉంటారు. కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా 40,000 వరకు ఉంటాయి. వైశ్యులు 18000, బ్రాహ్మణులు 10000, కమ్మ సామాజిక వర్గం వారు 5000 మంది వరకు ఓటర్లు ఉంటారు. దీంతో ఇక్కడఅంచనా వేయడం చాలా కష్టం.గెలుపు కూడా అంత సులువు కాదు. మరి ఇక్కడ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎలా బయటపడతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular