Site icon OkTelugu

Simhachalam Incident : సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

CM Chandrababu

CM Chandrababu

Simhachalam Incident  : సింహగిరి ( Visakha Simhachalam ) వరాహ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. దీనిపై సర్వత్ర ఆందోళన ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగానే గోడ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని.. 300 రూపాయల టికెట్ల క్యూ లైన్ లో ఈ ఘటన జరిగింది.

Also Read : జనవరిలో తిరుపతిలో..ఇప్పుడు సింహగిరిలో..ఎందుకలా

* భారీ వర్షంతోనే ఘటన
చందనోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ వర్షం పడింది. ఆ సమయంలో క్యూ లైన్( que line) లో ఉన్న భక్తులపై గోడ కూలిపోయింది. ఏడుగురు భక్తులు చనిపోగా చాలామంది గాయపడ్డారు. మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల సంఖ్య విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

* చంద్రబాబు భావోద్వేగం..
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఈ ఘటనపై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబంలో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. గాయపడిన వారికి మూడు లక్షల రూపాయలు అందిస్తామని కూడా చెప్పారు. సింహాచలం ఘటన తనను కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్ ఎస్పీ తో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

* విచారణకు ఆదేశం..
మరోవైపు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. విశాఖ జిల్లా కలెక్టర్( Visakha district collector ), ఎస్పీతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనకు గల కారణాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు అధికారులు ఆయనకు వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి!

Exit mobile version