Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: ఏపీలో బిజెపి ప్లాన్ అదే

AP BJP: ఏపీలో బిజెపి ప్లాన్ అదే

AP BJP: ఏపీ విషయంలో బిజెపి హై కమాండ్ సేఫ్ గేమ్ ఆడుతోందా? ఇక్కడ ఎవరు గెలిచినా తమ వారేనని భావిస్తోందా? అందుకే పెద్దగా తల దూర్చడం లేదా? పేరుకే కూటమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పై ప్రత్యేకంగా దృష్టి సారించిన బిజెపి.. ఏపీ విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణపై సారించిన దృష్టి కూడా.. కనీసం ఏపీ ఫై పెట్టలేదు. గత ఐదేళ్లుగా అన్ని అంశాల్లో జగన్ ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఇస్తూ వచ్చింది. తాజాగా తెలుగుదేశం కూటమిలో చేరింది. అయినా సరే ప్రచారంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ లెక్కన ఎవరు గెలిస్తే.. వారు తమ వారేనన్నట్టు బిజెపి వ్యవహరిస్తోంది.

ఆరు నెలల కిందట తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు క్యూ కట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదిపారు. చివరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సైతం ప్రధాని మోదీ, అమిత్ షా హాజరయ్యారంటే ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం అవుతోంది. అటు కర్ణాటకలో జేడిఎస్ తో పొత్తు పెట్టుకున్న బిజెపి చాలా యాక్టివ్ గా పని చేస్తోంది. అటు తమిళనాడులో సైతం పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళ సైని తమిళనాడు తీసుకెళ్లి పోటీలో పెట్టించారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో.. ఒక్క ఏపీ తప్పించి.. మిగతా చోట్ల బిజెపి యాక్టివ్ గా పనిచేస్తుండడం చర్చకు కారణమవుతోంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి ఏకపక్ష విజయం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం మైలేజ్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ లోలోపల భయం వెంటాడుతోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా బిజెపికి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. పొత్తు కుదిరిన తర్వాత నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. అయితే ఇది జరిగి నెల రోజులు అవుతున్నా.. అటు తరువాత బిజెపి పెద్దలు కానీ, ఏపీలో ఉన్న సీనియర్ నేతలు కానీ ప్రచారానికి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం బిజెపి తరఫున పోటీ చేస్తున్న వారంతా ప్రో టీడీపీ నేతలేనని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీనియర్లు ముఖం చాటేస్తున్నారు. 2014లో బిజెపితో కలిసి చంద్రబాబు అడుగులు వేశారు. పవన్ బయట నుంచి మద్దతు ప్రకటించారు. 2019లో ఒంటరిగా పోటీ చేసిన టిడిపి ఘోర పరాజయం పాలైంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా పొత్తుతో ముందుకెళ్లాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు కేంద్ర పెద్దలు అంగీకరించారు. అయితే 2019 ఎన్నికల తరువాత జగన్ ప్రభుత్వానికి మోడీ అంశాల వారిగా మద్దతుగా నిలుస్తూ వచ్చారు . అందుకే ఏపీలో ఇటు కూటమి అభ్యర్థులు గెలిచినా.. అటు వైసిపి అభ్యర్థులు గెలిచినా.. తమకు మద్దతుగా నిలుస్తారని బిజెపి భావిస్తోంది. అందుకే ఆంధ్ర రాజకీయాల్లో తల దూర్చడం లేదన్న టాక్ నడుస్తోంది. కేవలం ఏపీ విషయంలో బిజెపి తన చేతికి మట్టి అంటకుండా సేఫ్ గేమ్ ఆడుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version