Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి తరువాత సజ్జల అన్నట్టు పరిస్థితి మారింది. ఎక్కడో సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న ఆయన వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తరవాత పార్టీలో నెంబర్ 2 గా మారిపోయారు. ఆయన ప్రమేయం లేకుండా వైసీపీలో ఎటువంటి పరిణామాలు జరిగేవి కావు. ప్రభుత్వంలో సైతం కదలికలు ఉండేవి కావు. అంతలా సాగింది ఆయన హవా. కానీ కూటమి వచ్చిన తర్వాత సజ్జల అడ్డంగా బుక్ అవుతారని అంతా భావించారు. కానీ అప్పట్లో మంత్రులుగా పదవులు చేపట్టిన వారు, కీలక నాయకుల అవినీతి బయటకు వచ్చింది కానీ.. సజ్జల పేరు ఎక్కడ వెలుగులోకి రాలేదు. దీంతో సజ్జల సేఫ్ జోన్ లో ఉన్నారని అంతా భావించారు. ఇటువంటి తరుణంలోనే మద్యం కుంభకోణంలో ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
* స్వల్ప కాలంలోనే పార్టీలో ఎదిగి..
సజ్జల వైసీపీలో ఎదిగిన తీరు ఆ పార్టీ సీనియర్లకు కూడా మింగుడు పడదు. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సమానంగా రాజకీయం చేసిన వారు వైసీపీలో ఉన్నారు. అటువంటి వారిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి సజ్జల ద్వారా తనదైన రాజకీయాలు చేశారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిని కలవాలన్నా, ప్రభుత్వంతో ఏ పనులు జరగాలన్న ముందుగా కలవాల్సింది సజ్జలను. చివరకు టికెట్ల కేటాయింపు, పదవుల పంపకాలు అన్ని సజ్జల కనుసన్నల్లోనే జరిగాయి. కూటమి వచ్చిన తర్వాత వరుసగా వైసిపి నేతలు అరెస్టులు జరుగుతున్న వేళ.. కేసులు నమోదవుతున్న వేళ.. సజ్జల విషయంలో ఏం జరుగుతుందని చర్చ నడిచేది. తప్పకుండా ఆయన పై సైతం కేసులు నమోదవుతాయని.. అరెస్టు కూడా ఉంటుందని చాలా ప్రచారం నడిచింది. కానీ ఒక్కటంటే ఒక్క అవినీతి కేసు ఆయనపై బయటకు రాలేదు. ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు పెట్టినందుకు గాను ఒకే ఒక్క కేసు నమోదయింది.
* చాలా రకాలుగా జాగ్రత్తలు..
స్వతహాగా జర్నలిస్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వ విధానాలకు సంబంధించి, ప్రభుత్వ జీవోలకు సంబంధించి ఎక్కడా తన ముద్ర కానీ, తన సంతకం కానీ లేకుండా చూసుకున్నారు. భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కోకుండా వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడే జాగ్రత్త పడ్డారు. దాదాపు వ్యవహారాలన్నీ ఆయన కంట్రోల్లో నడిచినా.. ఎక్కడా చేతికి మట్టి అంటకుండా చూసుకున్నారు. అయితే మనిషన్న తర్వాత ఎక్కడో ఒక తప్పు చేయడం ఖాయం. ఏవో బలహీనమైన క్షణాల్లో తప్పులు జరిగిపోతూ ఉంటాయి. సజ్జల విషయంలోనూ అలానే ఒక తప్పు తాజాగా బయటపడినట్లు ప్రచారం నడుస్తోంది.
మద్యం కుంభకోణం పై లోతైన దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరకు జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ను సైతం దర్యాప్తు బృందం వదల్లేదు. అదే సమయంలో ఈడీ విచారణ చేపడుతోంది. నిన్ననే విజయసాయిరెడ్డి ఈడి ఎదుట హాజరయ్యారు. అయితే డిజిటల్ అంశంలో, నేరుగా నగదు చెల్లింపుల్లో భాగంగా ఓ కీలకమైన ఆధారం సజ్జలపై లభించినట్లు తెలుస్తోంది. వైసిపి హయాంలో మద్యం అమ్మకాల్లో కేవలం నగదు విక్రయాలకు ప్రాధాన్యమిచ్చారు. అలా ఆ క్యాష్ రూపంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఓ డిజిటల్ అంశం బయటపడింది దర్యాప్తులో. అందులో సజ్జల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మద్యం కుంభకోణంలో సజ్జల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.
