Rohini Karthe 2026 dates: భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నవగ్రహాలలో రాజుగా పరిగణించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాల మార్పు కూడా భూమిపై వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో సూర్యుడు Rohini Nakshatraలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోహిణి కార్తెలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడంటే?
రోహిణి నక్షత్రంలో సూర్యుడు మే 25న ప్రవేశిస్తాడు. జూన్ 8 వరకు సంచరించే ఈ కాలాన్ని సంప్రదాయంగా ‘రోహిణి కార్తె ’గా పిలుస్తారు. ఈ సమయంలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ప్రజల నమ్మకం. సాధారణ వేసవి వేడి ఒక ఎత్తయితే, రోహిణి కార్తె సమయంలో మాత్రం భూమి నిప్పుల కుండలా మారుతుందని పెద్దలు చెబుతుంటారు. మధ్యాహ్న సమయంలో బయట అడుగు పెట్టలేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ‘రోహిణి ఎండలు’ గురించి ఎన్నో సామెతలు, అనుభవాలు తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ‘రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయి’ అనే మాట ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ‘రోళ్లు’ అంటే రాళ్లు లేదా గట్టి వస్తువులు కూడా వేడి తట్టుకోలేక పగిలిపోతాయన్న అర్థంలో ఈ సామెత వాడతారు. అంటే ఈ సమయంలో ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పేందుకు పెద్దలు ఇలా పోల్చి చెబుతుంటారు.
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం రోహిణి నక్షత్రానికి అగ్ని తత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ సమయంలో సూర్య కిరణాలు మరింత ఉష్ణాన్ని విడుదల చేస్తాయని అంటారు. ఉదయం నుంచే మండే ఎండలు, మధ్యాహ్నం వేడి గాలులు, రాత్రివేళ కూడా తగ్గని ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రైతులు, కూలీలు, బయట పనులు చేసే వారు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా మే చివరి వారాలు, జూన్ ప్రారంభ రోజుల్లో భూమిపై ఉష్ణోగ్రతలు సహజంగానే అత్యధిక స్థాయికి చేరుతాయి. ఈ కాలంలో పొడి గాలులు, తేమ తగ్గడం, భూమి వేడి ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల వేడి తీవ్రత పెరుగుతుంది. అందుకే సంప్రదాయ జ్యోతిష్య భావనలు, ప్రజల అనుభవాలు రెండూ కలిసి రోహిణి కార్తెను అత్యంత వేడి కాలంగా పేర్కొంటాయి.
ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం, మధ్యాహ్న వేళ బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండ ప్రభావానికి త్వరగా గురయ్యే అవకాశం ఉండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
