Site icon OkTelugu

Rayalaseema Constituency Delimitation: పునర్విభజనతో ‘రాయలసీమ’ పైచేయి!

Rayalaseema Constituency Delimitation

Rayalaseema Constituency Delimitation

Rayalaseema Constituency Delimitation: మరోసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో పునర్విభజన బిల్లును వెనక్కి తీసుకుంది కేంద్రం. అయితే ఎట్టి పరిస్థితుల్లో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గ రాజకీయ పరిస్థితులు కలిసి వస్తున్నాయి. బెంగాల్ తో పాటు తమిళనాడులో లోక్సభ సభ్యుల బలం ఎన్డీఏకు అదనపు బలంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నిన్ననే తాజా వర్కింగ్ పేపర్ నియోజకవర్గాల పునర్విభజనపై విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు పెరగడంతో పాటు ఏపీలో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్న 25 పార్లమెంట్ స్థానాలకు గాను మరో పదమూడు సీట్లు పెరుగుతాయి. అయితే సింహభాగం పెరుగుదల అనేది రాయలసీమలో కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

* సరికొత్త ప్రతిపాదనలు..
గత కొంతకాలంగా తీవ్ర అధ్యయనం చేసిన ఈ ఆర్థిక మండలి తన నివేదికను బయటపెట్టింది. కొత్త ప్రతిపాదనలను పెట్టింది. వీటిని చూస్తే పునర్విభజనతో ఎక్కువగా లాభపడేది రాయలసీమ. అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్ సభ స్థానాలుగా ఉన్న కడప, కర్నూలు, అనంతపురం, రాజంపేట నియోజకవర్గాల పరిధి చాలా పెద్దదిగా ఉంది. ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని మూడు గా విభజిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అభిప్రాయపడింది. ఈ నాలుగు సీట్ల పరిధిలో మరో 8 పెరగనున్నాయన్నమాట. ఇదే జరిగితే భవిష్యత్తులో దేశ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో అధికార పీఠాన్ని శాసించడంలో రాయలసీమ విపరీతమైన ప్రభావం చూపి అవకాశం ఉంది.

* ఏకంగా 8 పెరుగుదల..
రాయలసీమలో పునర్విభజనతో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం కేవలం రెండు లోక్ సభ సీట్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. విశాఖ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలని ఈ మండలి ప్రతిపాదించింది. అంటే విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న పార్లమెంట్ స్థానాలను యధాతధంగా ఉంచి.. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఓ రెండు స్థానాలను విభజించి పెంచుతారు అనేది ఈ ప్రతిపాదనల సారాంశం. అయితే ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా, రాజకీయ ప్రాధాన్యత కలిగిన కోస్తాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పుడున్న సీట్లను యధాతధంగా ఉంచాలని ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. కోస్తా జిల్లాల్లో జనాభా నియంత్రణ ప్రమాణాలు స్థిరంగా ఉండటం, నియోజకవర్గాల భౌగోళిక పరిమితులు ఓటర్ల సంఖ్యకు అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 2027 జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన చేపడితే రాజకీయంగా రాయలసీమ మరోసారి పై చేయి సాధించే అవకాశం ఉంది. దాదాపు 13 పార్లమెంటు స్థానాలు పెరగడంతో అన్ని పార్టీల్లో ఆశావహులకు అవకాశాలు దక్కుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Exit mobile version