Homeఆంధ్రప్రదేశ్‌Posani: చిరంజీవి.. కాపులు.. మళ్లీ రగిల్చిన పోసాని

Posani: చిరంజీవి.. కాపులు.. మళ్లీ రగిల్చిన పోసాని

Posani: ఇటీవల చిరంజీవి ఏ చిన్న ప్రకటన చేసినా వివాదాస్పదంగా మారడం పరిపాటిగా మారింది. మొన్న ఆ మధ్యన జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు చిరంజీవి. నాడు వైసీపీ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మొన్నటికి మొన్న కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబు చిరంజీవిని కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటువంటి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. దీంతో సజ్జల నుంచి కిందిస్థాయి వైసీపీ నేత వరకు చిరంజీవిని ఆడిపోసుకున్నారు. చిరంజీవిని చిన్నపాటి జంతువులతో పోల్చి.. జగన్ ను మాత్రం సింహంగా చూశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వివాదం ముగియకముందే పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా వీడియో ఒకటి విడుదల చేశారు. ఈ తరుణంలో ఈసారి పోసాని కృష్ణ మురళి వచ్చారు. ఏకంగా కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

చిరంజీవి కుటుంబం పై పోసాని చేసినట్టుగా ఎవరు విమర్శలు చేయరు. ఒకానొక దశలో చిరంజీవి మాతృమూర్తిని కూడా పోసాని కృష్ణ మురళి అనరాని మాటలు అనేశారు. దానికి మెగా అభిమానుల నుంచి మూల్యం కూడా చెల్లించుకున్నారు. తరువాత కొద్దిరోజులపాటు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి జనసేనకు మద్దతుగా మాట్లాడడం, కూటమికి అనుకూలంగా ప్రకటనలు చేయడం, చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు పవన్ కు మద్దతు తెలపడంతో.. చిత్ర పరిశ్రమకు చెందిన నామినేటెడ్ పోస్టులో ఉన్న పోసాని కృష్ణ మురళి స్పందించాల్సి వచ్చింది. అయితే నాడు ప్రజారాజ్యం ఉదాంతాన్ని గుర్తు చేసి చిరంజీవిపై పోసాని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయని పోసాని ఎద్దేవా చేశారు. ఏనాడైనా చిరంజీవి ప్రజా సమస్యల గురించి చర్చించారా అని నిలదీశారు. ఇప్పుడు పవన్ ను గెలిపించమని ఎలా అడుగుతారని వ్యాఖ్యానించారు. ఎన్నో పార్టీలు తక్కువ సీట్లతోనే ప్రారంభమై.. అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ చిరంజీవి మాత్రం పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేశారని పోసాని హేళనగా మాట్లాడారు. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పిన చిరంజీవి.. ఇప్పుడు ఎలా రాజకీయాలు గురించి మాట్లాడతారని ప్రశ్నించారు. చిరంజీవి వెన్నుపోటుతో ఎంతోమంది కాపులు బలయ్యారని గుర్తు చేశారు. అందుకే చిరంజీవి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మొత్తానికైతే చిరంజీవిని విమర్శించే క్రమంలో కాపు సామాజిక వర్గాన్ని పోసాని తెరపైకి తేవడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version