Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. లోక్సభతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ–జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు బీజేపీని కూడా కలుపుకుపోయే ప్రయత్నం జరుగుతున్నా కొలిక్కి రావడం లేదు. మరోవైపు టీడీపీ–జనసేన టికెట్లు కూడా ప్రకటించారు. జనసేనకు 24 సీట్లు కేటాయించారు. 24 సీట్లలో కేవలం ఐదు గురికి మాత్రమే జనసేనాని టికెట్లు ఇచ్చారు. టీడీపీ 96 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీచేసే సీటుతోపాటు, మిగతా 19 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పిఠాపురం బరిలో పవన్..
పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొదట భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించారు. దీంతో జనసేన నేతలు అక్కడ పవన్కోసం పనిచేశారు. కానీ ఆయన సడెన్గా పిఠాపురంపై దృష్టిపెట్టారు. భీమవరం నుంచి రామాంజనేయులును బరిలో పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా విరమించుకున్నారు.
పూర్తిగా కాపులనే నమ్ముకుని..
జనసేన అధినేత పవన్ తన గెలుపు అవకాశాలను అంచనా వేసేందుకు రెండు సర్వేలు చేయించారు. ఈ క్రమంలోనే పిఠాపురం తెరపైకి వచ్చింది. పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పిఠాపురం నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 60 వేలకుపైగా కాపులు ఉన్నారు. కాపులు, ఇతర కులాలవారు ఓటు వేస్తే పవన్ గెలుపు ఈజీ అని సర్వేలో తేలినట్లు సమాచారం.
ఉభయగోదావరి కాపుల్లో విభేదాలు..
ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కాపులు, బీసీలు ఎక్కువ. అయితే కాపులు, బీసీల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కాపులు, ఎస్సీలు కూడా కలిసి ఉండరు. ఈ జిల్లాల్లో అన్ని సమాజిక వర్గాలు ఎవరికి వారు విడివిడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపులనే నమ్ముకున్న జనసేనాని పిఠాపురంవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి కాపులు పవన్ను అసెంబ్లీకి పంపుతారో లేదో చూడాలి.