Pawan Kalyan: ఏపీలో రేపు కూటమి ప్రభుత్వం కొలువు దీరనుంది. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అందులో భాగంగా కూటమిలోని పార్టీల శాసనసభ పక్ష నేతల ఎన్నిక ముందుగా పూర్తి చేయనున్నారు. తరువాత కూటమి పక్ష నేతగా చంద్రబాబును లాంఛనంగా ఎన్నుకోనున్నారు. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. కాసేపట్లో టిడిపి ఎల్పీ, బీజేఎల్పి నేత ఎన్నిక జరగనుంది.
ఈరోజు ఉదయం జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును జనసేన శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించారు. దీనిని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా బలపరిచారు. దీంతో ఆయన శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొద్ది సేపట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. చంద్రబాబు ఎన్నిక లాంచనమే. అటు బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎవరు ఎన్నికవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు సుజనా చౌదరి, విష్ణు కుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కనుంది.
రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. కూటమి పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఎన్డీఏ కూటమి నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి తరుపున చంద్రబాబు, పవన్, బిజెపి నేతలు కలిసి గవర్నర్ కు మద్దతు లేఖలను అందిస్తారు. దీంతో రేపు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు.