Site icon OkTelugu

Pawan Kalyan: పైసల్లేనిదే పాలిటిక్స్ లేదు.. పవన్ కు జ్ఞానోదయం

Pawan Kalyan

Pawan Kalyan: ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్న పని. డబ్బు లేనిదే ఎన్నిక ఉండదన్నది జగమెరిగిన సత్యం. వార్డు ఎన్నికకే లక్షలాది రూపాయలు ఖర్చు చేసే సమయం ఇది. అటువంటిది సార్వత్రిక ఎన్నికల అంటే ఏ స్థాయిలో ఖర్చు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఖర్చు పెట్టని అభ్యర్థి అంటే చులకనగా చూసే రోజులు ఇవి. చాలామంది నిజాయితీపరులు రాజకీయాల్లోకి వచ్చారు.డబ్బు రహిత రాజకీయాలు చేయాలని భావించారు. అయితే ఇలా వచ్చిన తరువాత వర్కౌట్ కాకపోవడంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఢిల్లీలో మాత్రం అమ్ ఆద్మీ పార్టీ ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా నినాదంతో ముందుకు వచ్చిన లోక్ సత్తా పార్టీ సైతం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. జనసేన అధినేత పవన్ సైతం ఈ సిద్ధాంతం తోనే రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ ఈ తరహా సిద్ధాంతాలు నేటి రాజకీయాల్లో పనిచేయవని గుర్తించగలిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జీరో మనీ పాలిటిక్స్ తో సగర్వంగా ప్రారంభించిన జనసేన విషయంలో.. చేయడం అసాధ్యమని పవన్ కళ్యాణ్ సైతం గుర్తించగలిగారు. ప్రస్తుతం పవన్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పవన్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపించారు. ‘ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాలి. మీరు డబ్బుతో ఓట్లను కొనాలని లేదా మీరు చేయకూడదని నేను చెప్పను.అది మీరే నిర్ణయించుకోవాలి. అంతకుమించి కష్టపడి పని చేయాలి ‘అని పవన్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

జీరో మనీ రాజకీయాలు చేయాలని పవన్ సూచించారు. ఇప్పుడు ఆయనే డబ్బు రాజకీయం గురించి మాట్లాడడం ఆశ్చర్యం వేయక మానదు. కానీ పవన్ వాస్తవానికి దగ్గరగా మాట్లాడారు. జరుగుతున్న పరిస్థితులను గుర్తించి తన వ్యాఖ్యలను సవరించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలంటేనే డబ్బు ప్రక్రియ గా ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మార్పు కోసం ప్రయత్నాలు చేసే పవన్ లాంటి వ్యక్తులకు వర్కౌట్ కావడం లేదు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసే వారిని ప్రజలు కూడా గుర్తించడం లేదు. అందుకే పవన్ లాంటి నేతలు తమ అభిప్రాయాలను మార్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.

Exit mobile version